iDreamPost

Chandrababu: బాబుకి జైలా? బెయిలా? తరుముకొస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం!

  • Published Jan 25, 2024 | 10:37 AMUpdated Jan 25, 2024 | 10:37 AM

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తారా.. లేదంటే బెయిల్‌ మీద బయటే ఉంటారా అన్న విషయం మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఆ వివరాలు..

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తారా.. లేదంటే బెయిల్‌ మీద బయటే ఉంటారా అన్న విషయం మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఆ వివరాలు..

  • Published Jan 25, 2024 | 10:37 AMUpdated Jan 25, 2024 | 10:37 AM
Chandrababu: బాబుకి జైలా? బెయిలా? తరుముకొస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం!

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ప్రధాన నిందుతుడుగా ఉన్న చంద్రబాబును అదుపులోకి తీసుకోకపోతే.. అతడు సాక్షులు, సహకుట్రదారులు, దర్యాప్తు చేసే అధికారులను బెదిరించడానికి అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొన్నది. అంతేకాక హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో.. అతడిని అరెస్ట్‌ చేయడానికి వీలవ్వలేదని తెలిపింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ జనవరి 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరో నాలుగు రోజుల్లో అనగా జనవరి 29న ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీం కోర్టు విచారించే అవకాశం ఉండటంతో.. టీడీపీ శ్రేణుల్లో భయం మొదలయ్యింది. మరో నాలుగు రోజుల్లో.. బాబుకు జైలా.. బెయిలా అన్న సంగతి తేలనుంది. మరో నాలుగు రోజుల్లో అసలు ఆట మొదలు కానుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మీద సుప్రీంకోర్టు ఎలా వ్యవహరిస్తూందో చూడాలి అంటున్నారు.

Jail for Babu or Bail

ఇప్పటికే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేశారు. స్కిల్‌ డెవల్‌మెంట్‌ కేసు తర్వాత చద్రబాబు మీద వరసగా ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అసలేంటి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. సీఆర్‌డీఏ అధికారులు.. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కోసం 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్‌మెంట్‌ రూపొందించారు. అలైన్‌మెంట్‌ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి. అయితే దీని వల్ల తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయించారు.

అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా అలైన్‌మెంట్‌ ఖరారు చేశారు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడమే కాక.. చంద్రబాబు, నారాయణ, వారి కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ సంస్థల పేరిట ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో భారీగా భూములు కొన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్విడ్‌ప్రోకో జరిపినట్లు ఏపీ సీఐడీ ఆరోపించింది.

2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన భూములు కూడా ఇక్కడే ఉండటంతో వాటి ధరలు కూడా భారీగా పెరిగాయి. అంతేకాక క్విడ్‌ప్రోకో కిందే కరకట్ట నివాసాన్ని లింగమనేని చంద్రబాబుకు అప్పగించారు.

ఆ ఇంటికి టైటిల్‌దారుగా లింగమనేని రమేశ్‌ ఉన్నప్పటికీ.. గత ఏడేళ్లుగా సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ చంద్రబాబు అదే నివాసంలో కొనసాగుతున్నారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చడమే పెద్ద కుంభకోణానికి దారి తీసిందని ఏపీ సీఐడీ ఆరోపించింది. అంతేకాక తమ భూములకు మార్కెట్ ధర పెరిగేలా చేసేందుకే అలైన్‌మెంట్ మార్చారని సీఐడీ చెప్పుకొచ్చింది. భారీ కుంభకోణం జరిగిందని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి