iDreamPost

కెటిఆర్ ఫాం హౌజ్ వ్యవహారంపై ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

కెటిఆర్ ఫాం హౌజ్ వ్యవహారంపై ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, మున్సిప‌ల్ శాఖ‌ మంత్రి, అధికార టిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కెటిఆర్) ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కెటిఆర్ అన్నారు. తనపై రాజకీయ కక్షపూరిత పిటిషన్ వేశారని, రేవంత్‌ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఫాంహౌజ్ తనది కాదని స్పష్టం చేసి హైకోర్టుకు కెటిఆర్ నివేదించారు. నిజా నిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వలు ఇవ్వడాన్ని కెటిఆర్ సవాల్ చేశారు. మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ పై జూన్ 5న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఫామ్ హౌస్ ఆక్రమణపై నిజ నిర్థారణ కమిటిని నియమించింది. జీఓ నెంబ‌ర్ 111 ఉల్లంఘ‌న‌కి సంబంధించిన కేసులో కెటిఆర్ కు నోటీసులు జారీ చేసింది.

మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తిగా జీవో 111ను ఉల్లంఘిస్తూ జ‌న్వాడ ప‌రిధిలో ఫామ్‌ హౌజ్‌ నిర్మించారంటూ ఇటీవలి కాంగ్రెస్ ఎంపి రేవంత్‌ రెడ్డి గ్రీన్ ట్రిబ్యూన‌ల్ లో చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ విచారణ జరిపింది. మంత్రి కెటిఆర్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వం, ప‌ర్యావ‌ర‌ణ నియంత్ర‌ణ మండ‌లి, హెచ్‌ఎండిఏకు నోటీసులు ఇచ్చింది.  అంతేగాక ఓ నిజనిర్దారణ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా సెంట్రల్‌ ఎన్విరాన్మెంట్‌ రిజిస్ట్రార్, ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ పిసిబి, జిహెచ్‌ఎంసి, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండిఎ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను చేర్చింది.

రెండు నెలల స‌మ‌య కాలంలో క‌మిటీ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. క‌మిటీ ఈ విషయంలో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత త‌దుపరి ఆదేశాలు వెల్ల‌డిస్తామ‌ని ఎన్‌జిటి ధ‌ర్మాసనం వెల్ల‌డించింది. ఎన్జీటి ఇచ్చిన ఉత్తర్వులపై కెటిఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటి ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. దీంతో ఎన్జీటి ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి