iDreamPost

ఆర్టీసీకి గ్రీన్‌ సిగ్నల్‌.. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ఆర్టీసీకి గ్రీన్‌ సిగ్నల్‌.. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

తెలంగాణలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను కొద్దిసేపటి క్రితం కేసీఆర్‌ స్వయంగా వెళ్లడించారు. హైదరాబాద్‌ నగరం మినహా మిగతా ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. అన్ని మత, విద్యా సంస్థలు పూర్తిగా మూసివేసి ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. బార్లు, క్రీడా మైదనాలు, క్లబ్లులు, పార్క్‌లు బంద్‌లో ఉంటాయని చెప్పారు. మెట్రో రైల్‌ బంద్, కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో ఒక మాస్క్‌లు ధరించాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. లేదంటే 1000 రూపాయలు ఫైన్‌ వేస్తామని హెచ్చరించారు. దుకాణాల్లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించడం, సానిటైజర్లు తప్పని సరిగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరగబోవని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు అనుమతిస్తామని చెప్పారు. కర్ఫ్యూ సమయానికి రాకపోకలు పూర్తవ్వాలని చెప్పారు. అన్ని ప్రైవేటు బస్సులకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఆటోలు, ట్యాక్సీలు, కార్లు, ఇతర ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా తిరుగుతాయని చెప్పారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల నుంచి బస్సులను అనుమతించబోమని చెప్పారు. ఎంజీబీఎస్‌కు బదులుగా జూబ్లి బస్‌స్టేషన్‌కు బస్సులు రాకను అనుమతిస్తామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి