iDreamPost

రేవంత్‌ సర్కార్‌ మంచి మనసు.. అరుదైన కేన్సర్‌తో బాధపడుతోన్న చిన్నారికి అండగా నిలిచి

  • Published Apr 28, 2024 | 11:49 AMUpdated Apr 28, 2024 | 11:49 AM

TS Govt: అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది అన్న వార్తలు నిన్న తెగ వైరల్‌ అయ్యాయి. దీనిపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. ఆ వివరాలు..

TS Govt: అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది అన్న వార్తలు నిన్న తెగ వైరల్‌ అయ్యాయి. దీనిపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. ఆ వివరాలు..

  • Published Apr 28, 2024 | 11:49 AMUpdated Apr 28, 2024 | 11:49 AM
రేవంత్‌ సర్కార్‌ మంచి మనసు.. అరుదైన కేన్సర్‌తో బాధపడుతోన్న చిన్నారికి అండగా నిలిచి

ఎనిమిదేళ్ల చిన్నారి అరుదైన క్యాన్సర్‌ బారిన పడింది. బిడ్డను బతికించుకోవడానికి చిన్నారి తల్లిదండ్రులు తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా.. ఫలితం లేకపోయింది. మరిన్ని డబ్బులు కావాల్సి వచ్చింది. బిడ్డకు చికిత్స చేయించడానికి ఆ తల్లిదండ్రల వద్ద చేతిలో రూపాయి లేదు. దాంతో తమ బిడ్డను బతికించుకోవడానికి చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయాన్ని కోరారు. దాంతో శనివారం నుంచి చిన్నారికి సంబంధించిన వార్తలు వైరలవుతున్నాయి. అలా ఇవి కాస్త ప్రభుత్వం దృష్టికి చేరాయి. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ సర్కార్‌ వెంటనే స్పందించి.. ఆ బిడ్డకు అండగా నిలిచారు. చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌, ఎల్బీ నగర్‌కు చెందిన రఘు, మంజుల ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె వేదవల్లి మూడో తరగతి చదువుతోంది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని కష్టం వచ్చింది. రెండేళ్ల క్రితం అనగా 2022లో చిన్నారి వేదవల్లికి జ్వరం వచ్చింది. వైద్యులకు చూపించి.. మందులు వాడారు. కానీ వేదవల్లి కోలుకోలేదు. పైగా చిన్నారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది. దాంతో మెరుగైన వైద్యం కోసం చిన్నారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వేదవల్లికి పరీక్షలు నిర్వహించగా.. పాపకు బ్లడ్‌ క్యాన్సర్‌గా తెలిసింది. అయితే అది ఏ తరహా క్యాన్సర్‌ అనేది తెలుసుకునేందుకు.. ముంబైలోని టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు వైద్యులు.

అత్యంత అరుదైన ​క్యాన్సర్‌..

వేదవల్లిని అక్కడకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా.. చిన్నారికి అత్యంత అరుదైన ‘అనాప్లాస్టిక్‌ లార్జ్‌ సెల్‌ లింఫోమా’ నాలుగో దశలో ఉన్నట్లు అక్కడ గుర్తించారు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో బయటపడే ఈ వ్యాధి చిన్నారి వేదవల్లికి సోకడం చూసి వైద్యులు కూడా షాకయ్యారు. ఇక ఈ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా వేదవల్లికి ఇప్పటికే అత్యంత క్లిష్టమైన కీమోథెరపీ, రేడియేషన్‌ 5 సైకిల్స్‌ పూర్తిచేయాగా.. వైద్యుల సూచనలతో బోన్‌మ్యారో మార్పిడి చేశారు. ‘కార్‌ టీ సెల్‌ థెరపీ’ చేయాల్సి ఉంది. అందుకు రూ.20 లక్షల ఖర్చువుతుందని వైద్యులు తెలిపారు.

ఇక ఇప్పటి వరకు పాప చికిత్స కోసం ఆ తల్లిదండ్రులు రూ.40 లక్షల వరకూ ఖర్చు చేశారు. తమ దగ్గర ఉన్న మొత్తం అయిపోవడంతో.. తెలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరీ బిడ్డ కోసం ఖర్చు చేశారు. అయినా సరే.. వేదవల్లి ఆరోగ్యం కుదుటపడలేదు. ఇప్పుడు చిన్నారికి కార్ టీ కణజాల థెరపీ చేయించాల్సి ఉంది. ఇందుకు మరో రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత పెద్ద మొత్తం సమకూర్చే స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం విజ్ఞప్తి చేశారు.

స్పందించిన ప్రభుత్వం..

ఈ విషయం గురించి తెలిసిన చాలా మంది స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో చిన్నారి వేదవల్లి పరిస్థితి గురించి తెలంగాణ ప్రభుత్వానికి తెలిసింది. దాంతో వేదవల్లి చికిత్సకు అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఒక ప్రకటనలో వెల్లడించారు.

చిన్నారి పరిస్థితిపై మీడియాలో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి.. వెంటనే ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. పాపకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మంత్రి సూచన మేరకు.. ఎంఎన్‌జే వైద్యులు.. వేదవల్లి కుటుంబ సభ్యులను కలిశారు. చిన్నారికి ప్రభుత్వం తరఫున తమ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి