iDreamPost
android-app
ios-app

పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష.. ఏమందంటే..

పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష.. ఏమందంటే..

ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాతతో ఆమె ఏడు అడుగులు వేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఆ నిర్మాతతో త్రిష గత కొద్దిరోజులుగా రిలేషన్‌లో ఉ‍న్నారని, ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేయటం మొదలుపెట్టాయి. అయితే, ఈ పెళ్లి వార్తలు ఒట్టి పుకార్లేని తేలింది. పెళ్లి వార్తలపై త్రిష తాజాగా స్పందించారు.

పెళ్లి పుకార్లు పుట్టించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘‘ డియర్‌.. మీకు తెలుసు.. మీరు ఎవరో.. మీ టీం ఏదో.. ఊరికే ఉండండి.. పుకార్లను పుట్టించొద్దు.. ’’ అంటూ మండిపడ్డారు. ఈ ట్వీట్‌తో త్రిష పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చినట్లు అయింది. కాగా, త్రిష 2015లో వరుణ్‌ మానియన్‌ అనే ఓ బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది.

దాదాపు ఐదేళ్ల తర్వాత 2020లో త్రిష పెళ్లిపై వార్తలు వచ్చాయి. ప్రముఖ తమిళ స్టార్‌ హీరో శింబును ఆమె పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారం కేవలం పుకారేనని తేలింది. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆమె పెళ్లిపై పుకార్లు రావటం.. వాటిపై నేరుగా త్రిషే స్పందించటం గమనార్హం. కాగా, త్రిష ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆమె విజయ్‌తో కలిసి నటించిన ‘లియో’ సినిమా విడులకు సిద్ధంగా ఉంది. మరి, త్రిష పెళ్లి విషయం కేవలం పుకారు మాత్రమేనని తేలటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.