iDreamPost

భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్ళిన దుండగులు!

భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్ళిన దుండగులు!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సినిమా స్టైల్ లో ఓ కిడ్నాప్ జరిగింది. భర్తపై దాడి చేసి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పరీక్షలు ఉండటంతో ఆటోలో వెళ్తున్న వివాహితను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి.. కిడ్నాప్ చేశారు. చాలా దూరం కారుతో ఛేజ్ చేస్తూ.. వెనుక నుంచి ఆటోను ఢీకొట్టారు. అనంతరం ఆటోలో ఉన్న మహిళ భర్తపై దాడి చేసి.. ఆమెను కిడ్నాప్ చేశారు. పట్టపగలు.. నడి రోడ్డుపై ఈ ఘటన జరగడంతో స్థానికులు షాక్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ కి సంబంధించి కొన్ని దృశ్యాలు సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సన్నీ, మాధవిలు గతకొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి తరపు వారు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం మాధవి, సన్నీలు..పారిపోయి.. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక బుధవారం మాధవీకి పరీక్షలు ఉండటంతో భర్తతో కలసి ఆటోలో పరీక్ష కేంద్రానికి వెళ్తోంది. ఈ క్రమంలో కొత్తగూడెంలోని సుజాత నగర్ ప్రాంతంలో వీరి ఆటోను కొందరు అడ్డగించారు. కిడ్నాపర్లు చాలా దూరం నుంచే వీరి ఆటోను కారుతో అనుసరిస్తున్నారు.  కారుతో ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టి అడ్డగించారు. అనంతరం కొందరు కారులో నుంచి దిగి.. సన్నీపై దాడి చేశారు.

మాధవి భర్తపై దాడి చేయడమే కాకుండా ఆమెను కిడ్నాప్ చేశారు. సన్నీపై దాడి చేసి.. మాధవిని కారులో ఎక్కించుకెళ్లారు. కులాంతర వివాహం ఇష్టం లేకే మాధవి తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారని.. ఆమె భర్త సన్నీ ఆరోపిస్తున్నారు. ఈ కిడ్నాప్ కి సంబంధించిన కొన్ని దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక సీసీ కెమెరాల ఆధారంగా  కిడ్నాప్ జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే పట్టపగలు, నడి రోడ్డుపై ఇలా కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇదీ చదవండికుమారుడు పరీక్షలో ఫెయిలయ్యాడని తల్లి ఆత్మహత్య!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి