iDreamPost

మూడు‌ ఎమ్మెల్సీలు : 30 మంది ఆశావహులు

మూడు‌ ఎమ్మెల్సీలు : 30 మంది  ఆశావహులు

తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌లో ఇప్పుడా పదవులపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వాటి కోసం ఏకంగా ముప్పై మంది పోటీ పడుతుండటం గమనార్హం. కొందరు నేతలు తమ పదవులు… తమకే కావాలని పట్టుబడుతుంటే… ఈసారి ఎలాగైనా ఆ పోస్టులను దక్కించుకోవాలని మరికొందరు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితి… ఆ పార్టీ అధినేతకు ఒకింత తలనొప్పిగా మారిందని ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న మాటలు.

టిఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల గొడవ మొదలైంది. జూన్ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతుండటంతో ఇన్ని రోజులూ పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలంతా పావులు కదుపుతున్నారు. ఎవరికి తోచిన దారిలో వారు ప్రయత్నాలు ప్రారంభించారు.

కరోనా కారణంగా మిగతా పదవులు, పార్టీ పదవులు కూడా ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో, నేతలంతా ఎమ్మెల్సీ పోస్టులపై కన్నేశారు. గతంలో సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేతలతో పాటు ఇతర నేతలు కూడా వీటిని ఆశిస్తున్నారు. వాటిని పదవిని దక్కించుకునేందుకు రకరకాల మార్గాల్లో ట్రయల్స్‌ వేస్తున్నారు.

ఒకటి, రెండు నెలల తేడాతోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న విషయం విదితమే. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే మాజీ ఎంపి కవితను ఫైనల్‌ చేయడం జరిగింది. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్నికను వాయిదా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎవరనేది క్లియర్ కావడంతోనూ, ఆ స్థానం నుంచి సిఎం కెసిఆర్ కుమార్తె నిలబెట్టడంతో పార్టీ ఇతర నేతల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. ఒకవేళ అభ్యంతరాలు ఉన్నా ఏ నేత బయటకు చెప్పలేరు. దీంతో ఆస్థానం అభ్యర్థి విషయంలో సిఎం కెసిఆర్ కు పెద్దగా తలనొప్పి రాలేదు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు గవర్నర్‌ కోటాలోని మూడు స్థానాలకు ఖాళీ అవుతున్నాయి. కనుక గవర్నర్‌ కోటాలోని మూడు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల విషయంలో కెసిఆర్ కు పెద్ద తలనొప్పి వచ్చిపడింది.

అయితే అభ్యర్థుల ఎంపిక దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు దృష్టి సారించారు. ఈనెల 17వ తేదీతో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి పదవి కాలం ముగియనుంది. ఆగస్టులో కర్నె ప్రభాకర్‌ది అదే పరిస్థితి. ఇక కాంగ్రెస్‌ లో చేరి అనర్హత వేటుకు గురైన రాములు నాయక్‌ పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. రాములు నాయక్‌ అనర్హత వ్యవహారం హైకోర్టులో ఉన్నప్పటికీ, ఆరేండ్లు పూర్తవడంతో ఈ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తున్నది.

ఒకవైపు మూడు స్థానాలకు అభ్యర్థుల కోసం పార్టీ హైకమాండ్‌ కసరత్తు చేస్తుంటే, మరోవైపు పదుల సంఖ్యలో ఆశావహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పదవీ కాలం ముగుస్తున్న వారిలో ఎవరికి తిరిగి ఇస్తారనే విషయంలో పార్టీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది.

సిఎం కేసీఆర్‌కు దగ్గరగా వుండే కర్నె ప్రభాకర్‌ను తిరిగి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు గులాబీ పార్టీలో చర్చ జరుగుతున్నది. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డికి తిరిగి సీటిస్తారా ? లేదా ? అనే సంగతి కూడా నేతల్లో నోళ్లల్లో నానుతున్నది. అప్పుడప్పుడు ఓపెన్‌గా కామెంట్లు చేయడం ఆయనకు మైనస్‌ అని కొందరు టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

పదవి ఇవ్వకపోతే… నాయిని చాలా విషయాలపై బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంటుందనీ, కాబట్టి ఆయనకు పదవిని పునరుద్దరించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఇక మూడో పదవి ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద… మూడు పదవుల కోసం ముప్పై మందికి పైగా ప్రయత్నాలు చేస్తున్నారు.

రెన్యూవల్‌ వ్యవహారంపై ఇంకా నిర్ణయం ఫైనల్‌ కాలేదు కాబట్టి ఆశావహులు గట్టిగానే యత్నాలు చేస్తున్నారు. మహిళల కోటాలో తుల ఉమ, గుండు సుధారాణి, ఉమా మాధవ రెడ్డి సహా మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పదవులు ఆశిస్తున్న నేతల్లో రంగారెడ్డి జిల్లా నేత క్యామ మల్లేష్‌, బస్వరాజు సారయ్య, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్‌, ఉద్యోగ సంఘాల మాజీ నేతలు దేవీప్రసాద్‌, స్వామిగౌడ్‌తో పాటు ప్రగతి భవన్‌, కేసీఆర్‌ ఫాంహౌస్‌లో సిఎంకు దగ్గరగా ఉండే కొద్దిమంది కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి