వీడియో: 8 అంతస్తుల భవనం ఎత్తులో ఒక్కసారిగా ఎగిసిపడిన నీరు!

మీరు సోషల్ మీడియాలో చాలా వైరల్ వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ, ఈ వీడియో మాత్రం మీకు నోట మాట రాకుండా చేస్తుంది. ఒక 1200 ఎంఎం వాటర్ పైప్ పగిలి అందులో నుంచి నీళ్లు ఏకంగా 8 అంతస్తుల భవనం ఎత్తుకు ఎగిసిపడ్డాయి. భూగర్భంలో నుంచి ఉప్పొంగిన నీరు 8 అంతస్తుల భవనం టెర్రస్ మీదకు చిమ్మాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ ఘటన ముంబయిలోని వెస్ట్ అంధేరీలో జరిగింది.

బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పశ్చిమ అంధేరీలోని ఆదర్శ్ నగర్ రోడ్ ట్వింకిల్ అపార్ట్ మెంట్స్ వద్ద రోడ్డుపైకి ఒక్కసారిగా నీరు ఎగిసిపడింది. 1200 ఎంఎం వాటర్ పైపు పగిలి నీళ్లు రోడ్లపైకి ఉప్పొంగాయి. పక్కనే ఉన్న 8 అంతస్తుల భవనం ఎత్తులో నీళ్లు చిమ్మాయి. అపార్ట్ మెంట్ లో ఉన్న నగరవాసులు భయాందోళనకు గురయ్యయారు. అక్కడ ఉన్న వారికి కూడా అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సమాచారం అందుకున్న బీఎంసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సప్లయ్ ఛానల్ ను బ్లాక్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వెంటనే పైపు లైన్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.

ఆ పనులు పూర్తయ్యే వరకు మిల్లట్ నగర్, ఎస్వీపీ నగర్, లోకానంద్ వాలా ప్రాంతాలకు నీటి సరఫరా చేయడం కుదరదని అధికారులు వెల్లడించారు. రిపేర్ పూర్తవగానే నీటి సరఫరా ప్రారంభింస్తామన్నారు. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దానిపై కూడా ఇంజినీర్లు దర్యాప్తు ప్రారంభించారు. అది పాత పైపులైన్ కావడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. బుధవారం రాత్రికల్లా పనులు పూర్తి చేశారు. పైపులైన్ పగిలే సమయంలో పెద్దఎత్తున శబ్ధం రావడం విన్నామని చాలా మంది చెప్పారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూడగా.. నీరు ఆకాశం ఎత్తులో ఎగిసిపడుతున్నయాన్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ముంబయి నగరానికి వాటర్ ఫాల్స్ తీసుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఇంకొందరు పైపులైన్ పాతదని తెలిసినప్పుడు ఎందుకు అలాగే వదిలేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments