iDreamPost
android-app
ios-app

నేడే హైదరాబాద్‌లో WWE.. తొలి పోరులో జాన్‌ సినా!

నేడే హైదరాబాద్‌లో WWE.. తొలి పోరులో జాన్‌ సినా!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్‌ కార్యక్రమానికి హైదరాబాద్‌ నగరం వేదికైన సంగతి తెలిసింది. ఈ శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ స్పెక్టాకిల్‌’ పేరిట.. ప్రపంచ ప్రసిద్ది చెందిన రెస్లర్‌ జాన్‌ సినాతో పాటు మొత్తం 28 మంది రెస్లర్లు రింగులో తలపడనున్నారు. జాన్‌ సినా, సమీజైన్‌, కెవిన్‌ ఓవెన్స్‌, గుంథర్‌, జిందర్‌ మహాల్‌, వీర్‌, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్‌, బెక్కీ లించ్‌, నటల్య మాట్‌ రిడిల్‌, లుడ్విగ్‌ కైజర్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

మరికొద్ది సేపట్లో మొదటి ఫైట్‌ ప్రారంభం కానుంది. మొదటి పోరులో స్టార్‌ రెస్లర్‌ జాన్‌ సినా ప్రత్యర్థితో తలపడనున్నారు. రెస్లింగ్‌ కార్యక్రమం కోసం జాన్‌ సినా ఇండియాకు రావటం ఇదే మొదటి సారి. దీనికి తోడు సౌత్‌ ఇండియాలో ఇప్పటి వరకు ఎప్పుడూ డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమం జరగలేదు. సౌత్‌లో మొదటిసారిగా హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమం జరుగుతోంది. అంతేకాదు! దాదాపు 6 ఏళ్లుగా ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ నిర్వహించటం లేదు. అలాంటిది ఆరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ రోజు జరగబోయే కార్యక్రమంలో భారత దేశానికి చెందిన జిందర్‌ మహాల్‌, వీర్‌, సంగలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌ కార్యక్రమం నెల రోజుల ముందే పూర్తయింది. టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా జాన్‌ సినాను లైవ్‌లో చూడాలన్న ఉద్ధేశ్యంతో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. మరి, సౌత్‌లో మొదటిసారి.. అది కూడా హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్‌ కార్యక్రమం జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి