iDreamPost
android-app
ios-app

Container School: తెలంగాణలో తొలి కంటెయినర్‌ ప్రభుత్వ పాఠశాల ప్రారంభం!

  • Published Sep 16, 2024 | 7:56 PM Updated Updated Sep 16, 2024 | 7:56 PM

Telangana: తెలంగాణలో తొలి కంటెయినర్ స్కూల్ ప్రారంభం కాబోతుంది. మలుగు జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ను తయారు చేశారు.

Telangana: తెలంగాణలో తొలి కంటెయినర్ స్కూల్ ప్రారంభం కాబోతుంది. మలుగు జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ను తయారు చేశారు.

Container School: తెలంగాణలో తొలి కంటెయినర్‌ ప్రభుత్వ పాఠశాల ప్రారంభం!

తెలంగాణ రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ ప్రారంభం కాబోతుంది. మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను తయారు చేశారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వకపోవడంతో కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించి కంటైనర్ పాఠశాల నిర్మాణానికి చుట్టారు. ఈ స్కూలుని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క మంగ‌ళ‌వారం నాడు ప్రారంభించ‌బోతున్నారు. ములుగు జిల్లాకి చెందిన కన్నాయి గూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల ఉంది. ఇది పాడయి పోయి బాగా శిధిలావ‌స్త‌కు చేరుకుంది. ఇది మారుమూల అట‌వీ ప్రాంతం కావ‌డం వలన కొత్త స్కూల్ కట్టడానికి అటవీ అధికారులు అనుమతులని ఇవ్వలేదు. దీంతో ఇక్క‌డ కంటెయిన‌ర్ పాఠ‌శాలని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాఠ‌శాలకి శ్రీకారం చుట్టారు.

గతంలో కూడా కంటెయిన‌ర్ ఆసుప‌త్రిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు అక్కడ స్థానిక ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయి. ఇక అదే కోవ‌లో ఇప్పుడు ఇలా పాఠ‌శాల‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల విషయానికి వస్తే.. ఇది 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఈ స్కూల్ లో ఇద్ద‌రు టీచ‌ర్లు ప‌ని చేయనున్నారు. ఇంకా వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్య‌వంతంగా కూర్చునే విధంగా ఈ పాఠ‌శాల‌ను తయారు చేశారు. కలెక్టర్ నిధులు రూ.13 లక్షలతో 12 డ్యూయల్ డెస్కులతో ఈ స్కూల్ కట్టారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది.

ఇక బంగారుపల్లి ప్రజల అభివృద్ది కోసం సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. ఏజెన్సీ ఆవాస గ్రామాల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు సరైన సదుపాయాలు లేవు. వీటికి అనుగుణంగా అట‌వీ చ‌ట్టంలో మార్పులు చేయాల‌ని కోరారు. తాగు నీటికి అవ‌స‌ర‌మైన పైపులు, విద్యుత్ లైన్లు, ర‌హ‌దారులు, ప్ర‌భుత్వ భ‌వ‌నాలు నిర్మించేందుకు అట‌వీ నిబంధ‌న‌లు అడ్డుగా ఉన్నాయని అన్నారు. అట‌వి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తాగు నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు సోలార్ విద్యుత్ ను వాడాల్సి వ‌స్తుంద‌న్నారు. విద్యా, వైద్య సేవ‌లు ప్రజలకు అందేలా అట‌వీ చ‌ట్టంలో త‌గిన‌ మార్పులు తీసుకు రావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. ఇక ఈ కంటైనర్ స్కూల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.