iDreamPost
android-app
ios-app

Nalgonda: కళ్లు లేకపోయినా.. ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలు.. నల్లగొండ బిడ్డ టాలెంట్‌

  • Published Jul 06, 2024 | 8:35 AM Updated Updated Jul 06, 2024 | 8:35 AM

కళ్లు లేకపోయినా.. ఆ లోపం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది నల్లగొండ యువతి. ఓకేసారి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాలు..

కళ్లు లేకపోయినా.. ఆ లోపం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది నల్లగొండ యువతి. ఓకేసారి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాలు..

  • Published Jul 06, 2024 | 8:35 AMUpdated Jul 06, 2024 | 8:35 AM
Nalgonda: కళ్లు లేకపోయినా.. ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలు.. నల్లగొండ బిడ్డ టాలెంట్‌

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు.. అని ఓ సామెత ఉంది. మనలో కష్టపడాలనే తత్వం.. సాధించాలనే తపన ఉంటే చాలు.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఆఖరికి వైకల్యం ఉన్నా సరే.. అవరోధాలను దాటుకుని.. ముందుకు సాగుతారు. అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి. ఆమెకు దృష్టి లోపం ఉంది. అయినా సరే అది ఆమె గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా మారలేదు. ఆమె పట్టుదల ముందు వైకల్యం తలవంచింది.. ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు దాసోహం అయ్యింది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 6 సర్కారు కొలువులు సాధించింది. ఆమె ప్రతిభపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నా సరే వాటిని దాటుకుని 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ నల్లగొండ బిడ్డ విజయ ప్రస్థానం మీ కోసం..

నల్లగొండకు చెందిన రాజశేఖర్, స్వర్ణలత దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రీపూజిత అనే కుమార్తె జన్మించింది. అయితే తను పుట్టుకతోనే అంధురాలు.. దృష్టి లోపంతో జన్మించింది. అయితే బిడ్డకున్న లోపాన్ని చూసి వారు కుంగిపోలేదు. చూపు లేకపోతేనేం.. మనో నేత్రం ఉంటే చాలు.. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని బలంగా నమ్మారు. దానిలో భాగంగానే తమ బిడ్డకున్న లోపాన్ని వారు పెద్ద సమస్యగా భావించలేదు. శ్రీపూజితను అంధురాలిగా కాకుండా నార్మల్‌ యువతిగానే పెంచారు. అసలు తనకున్నది పెద్ద సమస్య కాదనే విధంగా ఆమెను పెంచారు. అన్ని రంగాల్లో ప్రోత్సాహించారు.

ఇక శ్రీపూజిత పదోతరగతి వరకు నల్గొండ అంధుల పాఠశాలలో, ఇంటర్‌ సాయి అంధుల జూనియర్‌ కళాశాల (హైదరాబాద్‌), డిగ్రీ బీఏ కోర్సు నల్గొండ ఎన్జీ కళాశాలలో, పీజీ హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, బీఈడీ నల్గొండ గోకుల్‌ కళాశాలలో పూర్తి చేసింది. అంతేకాక జాతీయస్థాయిలో నిర్వహించే నెట్‌కు సైతం అర్హత సాధించింది శ్రీపూజిత. తాను అంధురాలని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్య పూర్తిచేసింది. ఈ క్రమంలో 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆ జాబ్‌లో జాయిన అయ్యి.. దాన్ని చేస్తూనే… గురుకుల లెక్చరర్‌ కొలువుకు సిద్ధమైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది.

పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) తెలుగు, సోషల్, టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) తెలుగు, సాంఘికశాస్త్రం, జూనియర్‌ లెక్చరర్‌ తెలుగు, డిగ్రీ లెక్చరర్‌ తెలుగు ఉద్యోగాలను సాధించింది. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను ప్రశంసిస్తున్నారు. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ.. ‘‘నేను అంధురాలునని ఏ రోజూ బాధపడలేదు. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సాహించారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు బ్రెయిలీ లిపిలో చదివిన నేను ఏ రోజూ విషయంలో ఇబ్బంది పడలేదు’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాక ‘‘నా ప్రిపరేషన్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారం, యూట్యూబ్‌లో పాఠ్యాంశాలను వింటూ ప్రిపేర్‌ అయ్యాను. అలా అన్ని అంశాలను అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో పరీక్షను బాగా రాసి ఉత్తీర్ణత సాధించాను’’ అని శ్రీ పూజిత తెలిపింది. కృషి, పట్టుదలతో అంధులు కూడా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉపాధ్యాయ వృత్తిపై తనకు మక్కువ ఉందని, తను సాధించిన ఆరు ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చింది పూజిత.