ఇండియా వరల్డ్‌ కప్‌ గెలవాలంటే అతను టీమ్‌లో ఉండాలి: గంగూలీ

మనం దేశంలో ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ను గెలవడమే లక్ష్యంగా టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. కప్పు కొట్టే జట్టు కోసం దాదాపు ఏడాది కాలంగా దృష్టి పెట్టి, అలాంటి టీమ్‌ను రెడీ చేసే పనిలో చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సిరాజ్‌, జడేజా, హార్దిక్‌ పాండ్యా లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఇప్పటికే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉండటం దాదాపు ఖాయమే. గాయాలాంటి బెడద లేకుంటే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో వీరి ప్లేసులు ఫిక్స్‌. అయితే మరి మిగతా స్థానాల్లో ఎవరు ఉంటారు? ఎవరుండాలి? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

యువ క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉండటం, ఆటగాళ్లు నిలకడగా రాణించలేకపోవడం, గాయాల పాలవుతుండటంతో టీమ్‌కు పూర్తి స్థాయిలో తుది రూపు రావడంలేదు. కాలంగా టీమ్‌లో పర్మినెంట్‌ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన కేఎల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారు. వరల్డ్‌ కప్‌ సమయానికి వారు పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధిస్తారో లేదో చూడాలి. ఒక వేళ సరిగ్గా అదే సమయానికి బరిలో దిగేందుకు రెడీ అయినా.. నేరుగా వరల్డ్‌ కప్‌ ఆడేందుకు బీసీసీఐ అవకాశం ఇస్తుందో లేదో అనుమానమే.

ప్రస్తుతం టీమ్‌లో కొంతమంది యువ క్రికెటర్లు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ప్లేసే టార్గెట్‌గా పెట్టుకుని ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌, బీసీసీఐ మాజీ ఛైర్మన్‌ సౌరవ్‌ గంగూలీ ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌ను వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఆడించాలని సూచించాడు. ఈ యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌ టీమ్‌లో ఉంటే.. రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేస్తే.. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ బ్యాటింగ్‌ కాంబినేషన్‌ ప్రత్యర్థి టీమ్‌పై ఒత్తిడి పెంచుతుందని అభిప్రాయపడ్డాడు. మరి దాదా సూచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నా భార్య నన్ను కాదని అతన్ని ఇష్టపడుతోంది: స్టార్‌ క్రికెటర్‌

Show comments