iDreamPost
android-app
ios-app

ఒక్క టోర్నీతో దేశానికి 12 వేల కోట్ల లాభం.. అందుకే క్రికెట్ మన ఊపిరి అనేది!

  • Published Sep 11, 2024 | 4:43 PM Updated Updated Sep 11, 2024 | 4:43 PM

ICC World Cup 2023, BCCI, Indian Economy: ఒక్క క్రికెట్ టోర్నమెంట్​తో దేశానికి భారీ ఆదాయం సమకూరింది. వేల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఇది చూసిన నెటిజన్స్ అందుకే క్రికెట్ మన ఊపిరి అని అంటుంటారని చెబుతున్నారు.

ICC World Cup 2023, BCCI, Indian Economy: ఒక్క క్రికెట్ టోర్నమెంట్​తో దేశానికి భారీ ఆదాయం సమకూరింది. వేల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఇది చూసిన నెటిజన్స్ అందుకే క్రికెట్ మన ఊపిరి అని అంటుంటారని చెబుతున్నారు.

  • Published Sep 11, 2024 | 4:43 PMUpdated Sep 11, 2024 | 4:43 PM
ఒక్క టోర్నీతో దేశానికి 12 వేల కోట్ల లాభం.. అందుకే క్రికెట్ మన ఊపిరి అనేది!

క్రికెట్ మన దేశంలో ఒక మతమని ఊరికే అనలేదు. ఇక్కడి ప్రజల నరనరాల్లోనూ అది ఎక్కేసింది. భారత్​లోని సుమారుగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో బాల్ పట్టి బౌలింగ్ వేసినవారే, బ్యాట్ పట్టి ఫోర్లు, సిక్సులు కొట్టినవారే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గ్రామాలు, నగరాలనే తేడాల్లేకుండా ప్రతి వీధిలో, వాడలో ఎవరో ఒకరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. అంత ఫ్యాన్ బేస్, క్రేజ్ ఉంది కాబట్టి ఈ గేమ్ ద్వారా అటు భారత క్రికెట్ బోర్డు ఖజానా నిండటంతో పాటు ఇటు దేశ ఎకానమీకి కూడా ఎంతో బలం చేకూరుతోంది. ఒక్క టోర్నమెంట్​తో మన దేశానికి దాదాపు 12 వేల కోట్ల లాభం వచ్చిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఒకే ఒక్క క్రికెట్ టోర్నీతో భారత ఎకానమీకి అంత లాభం చేకూరింది. ఏంటా టోర్నీ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గతేడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్-2023 జరిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన ఈ మెగా టోర్నమెంట్​లో ఆతిథ్య టీమిండియా రన్నరప్​గా నిలిచింది. కప్పు పోయినా భారత ఎకానమీకి ఈ టోర్నీ ఎంతో లాభం చేకూర్చింది. మెగాటోర్నీ నిర్వహణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ఏకంగా రూ.11,637 కోట్లు వచ్చి చేరాయని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ వెల్లడించింది. ఐసీసీ టోర్నమెంట్స్​పై నీల్సన్ సంస్థ ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్​మెంట్ నిర్వహించింది. ఇప్పటివరకు నిర్వహించిన వరల్డ్ కప్స్​లో భారత్​ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ కప్-2023నే బిగ్గెస్ట్ అని ప్రకటించింది. ఈ మెగాటోర్నీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ లాభం చేకూరిందని, క్రికెట్ పవర్ ఏంటో దీని ద్వారా అర్థమవుతోందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెఫ్ అలార్డిక్ ఓ ప్రకటనలో తెలిపారు.

వరల్డ్ కప్-2023కి ఆతిథ్యం ఇచ్చిన సిటీలకు టూరిజం ద్వారా 861 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని ఐసీసీ పేర్కొంది. మెగాటోర్నీలోని మ్యాచులకు దేశంతో పాటు విదేశాల నుంచి భారీగా క్రికెట్ లవర్స్, ఫ్యాన్స్, ఆడియెన్స్ తరలివచ్చారు. వీళ్లందరికీ అకామిడేషన్, ట్రావెల్, ట్రాన్స్​పోర్టేషన్, ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్వారా ఆయా నగరాలు భారీగా డబ్బును వెనకేసుకున్నాయని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే ఇది వాస్తవ ఆదాయమా? కాదా? అనేది మాత్రం అత్యున్నత క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. కాగా, భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్​కు ఏకంగా 10 లక్షల మందికి పైనే హాజరవడం విశేషం. 50 ఓవర్ల ప్రపంచ కప్​కు స్టేడియాల్లో ఈ స్థాయిలో ప్రేక్షకులు పోటెత్తడం ఇదే మొదటిసారి కావడం మరో హైలైట్. మొత్తానికి ఈ ప్రపంచ కప్ అన్ని విధాలుగా భారత ఎకానమీని పరిపుష్టి చేసిందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.