iDreamPost
android-app
ios-app

తొలి వన్డేలో వెస్టిండీస్‌ చిత్తు.. సత్తాచాటిన టీమిండియా స్పిన్నర్లు!

  • Published Jul 28, 2023 | 7:47 AM Updated Updated Jul 28, 2023 | 8:23 AM
  • Published Jul 28, 2023 | 7:47 AMUpdated Jul 28, 2023 | 8:23 AM
తొలి వన్డేలో వెస్టిండీస్‌ చిత్తు.. సత్తాచాటిన టీమిండియా స్పిన్నర్లు!

వెస్టిండీస్‌ జట్టు మరీ పసికూనను ట్రీట్‌ చేసినట్లు చేస్తోంది టీమిండియా. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. నిజానికి అది క్లీన్‌స్వీప్‌ కావాల్సింది కానీ, వర్షం వల్ల వైట్‌వాష్‌ నుంచి విండీస్‌ తప్పించుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. చాలా కాలం తర్వాత టీమ్‌లోకి వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌తోనే అదరగొట్టాడు. ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతనికి జడేజా కూడా మూడు వికెట్లతో తోడయ్యాడు. ఇద్దరు స్పిన్నర్లు 7 వికెట్ల పడగొట్టి విండీస్‌ను కోలుకోకుండా చేశారు. టీమిండియా యంగ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ముందు విండీస్‌ జట్టు నిలువలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్‌ టీమ్‌ కంటే కాస్త బెటర్‌గానే వన్డే టీమ్‌ ఉన్నా.. కనీసం పోరాటం చూపలేకపోవడం గమనార్హం. బ్రెండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, షై హోప్‌, రోవ్‌మన్‌ పావెల్‌, షెపర్డ్‌ లాంటి స్టార్స్‌ టీమ్‌లోకి వచ్చినా.. విండీస్‌ రాత మాత్రం మారలేదు. హార్దిక్‌ పాండ్యా, శార్దుల్‌ ఠాకూర్‌, ముఖేష్‌ కుమార్‌ టాపార్డర్‌ను పెవిలియన్ చేర్చగా.. మిగిలిన వారిని కుల్దీప్‌, జడేజా సర్దేశారు. విండీస్‌ కెప్టెన్‌ హోప్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తానికి 23 ఓవర్లలోనే 114 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌటైంది.

115 పరుగులు స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి గెలిచింది. టార్గెట్‌ మరీ చిన్నది కావడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. తాను ఓపెనింగ్‌కు రాకుండా, వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లీని దింపకుండా.. కుర్రాళ్లను ముందుగా బ్యాటింగ్‌కు దింపాడు. దీంతో శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్‌ ఓపెనింగ్‌ చేశాడు. టెస్టుల్లో దారుణంగా విఫలమైన గిల్‌, అదే ఫెల్యూర్‌ను ఇక్కడ కూడా కొనసాగించాడు. 16 బంతుల్లో 7 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఇక ఇషాన్‌ కిషన్‌ మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ 19 పరుగులు మాత్రమే చేశాడు. హార్దిక్‌ పాండ్యా(5), శార్దుల్‌ ఠాకూర్‌(1) విఫలమయ్యారు. జడేజా 16, 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను గెలిపించారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు రాకపోవడంపై క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందారు. ఇక నాలుగు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విమర్శలను పట్టించుకోను.. నా ఫుల్ ఫోకస్ దాని పైనే..: రోహిత్ శర్మ