iDreamPost
android-app
ios-app

పాపం వెస్టిండీస్.. జడేజా- కుల్దీప్ దెబ్బకు వన్డే కాస్తా టీ20 అయ్యింది!

పాపం వెస్టిండీస్.. జడేజా- కుల్దీప్ దెబ్బకు వన్డే కాస్తా టీ20 అయ్యింది!

వెస్టిండీస్ టూర్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ మీద కన్నేసింది. తొలి వన్డేలే అద్భుతైన ప్రదర్శనతో భారత బౌలర్లు వెస్టిండీస్ ని చుట్టేశారు. బౌలర్లు అందరూ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెలరేగడంతో వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి ఓవర్ నుంచి వెస్టిండీస్ బ్యాటర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. కేవలం 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

వెస్టిండీస్ కష్టాలు వన్డే సిరీస్ లో కూడా కొనసాగుతున్నాయి. స్వదేశంలో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ని ఏలిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు పసికూన మాదిరిగా మారిపోయింది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ మరోసారి తమ డొల్ల తనాన్ని బయటపెట్టింది. 50 ఓవర్ల మ్యాచ్ లో సగం ఓవర్లు కూడా ఆడలేకపోయారు. కేవలం 23 ఓవర్లకే ఆలౌట్ అయి పెవిలియన్ చేరారు. షాయ్ హోప్ మినహా.. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. ఒక్క బ్యాటర్ కూడా 50 పరుగుల మార్క్ ని దాటలేకపోయారు.

షాయ్ హోప్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. అలిక్ అతనేజ్(22), బ్రాండన్ కింగ్(17), హెట్ మేయర్(11) పర్వాలేదనిపించారు. ఇంక మొత్తం జట్టు 114 పరుగులకు ఆలౌట్ అయ్యారు. భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. కేవలం మూడో ఓవర్లు వేసి.. వాటిలో 2 మెయిడిన్ చేసి.. 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 6 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం భారత్ కు అంత కష్టం కాదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.