iDreamPost
android-app
ios-app

ఈ వీరమహిళ చెప్పేది వాస్తవమేనా ?!

  • Published Mar 23, 2022 | 8:33 AM Updated Updated Mar 23, 2022 | 8:38 AM
ఈ వీరమహిళ చెప్పేది వాస్తవమేనా ?!

అద్దాల మేడలో ఉన్నవారిపై రాళ్లు వేయడం చాలా సులువు. రాజకీయ నాయకులు , సినిమా స్టార్లు లాంటి వారిపై బురద జల్లి ప్రయోజనాలు , ప్రచారం పొందినవారు ఎంతో మంది ఉన్నారు . అయితే అందర్నీ ఒకే గాటన కట్టలేము . కొంతమంది వారి చేతుల్లో మోసపోయిన వారూ ఉంటారు . అలాంటి వారు మీడియాను , పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగదు . తాజాగా సినీ ఆర్టిస్టు నుంచి జన సేన వీరమహిళగా మారిన సునీత బోయ విషయంలో న్యాయాన్యాయాలను పోలీసులు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది . ఆమె సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు , పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు , సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది . విలేఖర్ల సమావేశానికి వచ్చిన ఆమె వేశభాషలు చూస్తే సునీత చెప్పేది వాస్తవమో … అబద్దమో అర్థంకాని పరిస్థితి . తన వద్ద ఉన్న ఆధారాలను కూడా గీతాఆర్ట్స్ సంస్థ వారు లాగేసుకున్నారని సునీత ఆరోపిస్తుండటం గమనార్హం . దీనిపై బన్నీ వాసు స్పందించి వాస్తవాలు వెల్లడిస్తే కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి .

ఆర్టిస్టు నుంచి వీరమహిళగా ….

అనంతపురంనకు చెందిన సునీత బోయ సినీ జూనియర్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి ప్రవేశించారు . ఈక్రమంలో జనసేన ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు . మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగసభల సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా ఉన్న నిర్మాత బన్నీ వాసుతో పరిచయం సాన్నిహిత్యానికి దారితీసినట్లు సునీత చెబుతున్నారు . డ్రగ్స్ , ఇంజక్షన్లు ఇచ్చి తనపై వాసు అఘాయిత్యానికి పాల్పడ్డాడని , ఆయన చేతుల్లో పలువురు ఇలాగే మోసపోయారని ఆమె ఆరోపించారు .

ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ , ఆయన సోదరుడు నాగబాబుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మూడేళ్ళుగా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్యాయానికి గురైన సుగాలి ప్రీతి వంటి బాధితులకు అండగా నిలుస్తున్న పవన్ కల్యాణ్ తన విషయంలో స్పందించి తగిన న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు .

రెండు రోజుల్లో స్పందించకుంటే…జనసేన నాయకులకు అల్టిమేటం

మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో సునీత ఫిర్యాదుచేశారు . అక్కడే విలేఖర్ల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన ఆమె తనకు బన్నీ వాసు పరిచయమైన రాజమహేంద్రవరంను పోరాట కేంద్రంగా ఎంచుకున్నారు . జనసేన నాయకులు కందుల దుర్గేష్ , గంటా స్వరూప వంటి వారు స్పందించాలని డిమాండ్ చేశారు . రెండురోజుల్లో దీనిపై స్పందించకపోతే రాజమహేంద్రవరం నుంచే పోరాటం చేస్తానని , ఆతరువాత గత ఎన్నికల్లో తాను పనిచేసి గెలిపించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో అధికార వైసిపిలో చేరిపోతానని వెల్లడించారు . అలాగే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని సునీత చెబుతున్నారు . సునీత ఆరోపణలు వాస్తవమేనా … ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా తదితర అంశాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది .