కాంగ్రెస్‌లో రేవంత్‌ వర్సెస్‌ పొంగులేటి.. నేతల మధ్య చిచ్చు పెట్టిన టికెట్లు

కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ప్రకటన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరో 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ నియోజకవర్గం టికెట్‌ కేటాయింపు అంశం కారణంగా ప్రస్తుతం కాం​గ్రెస్‌లో రేవంత్‌రెడ్డి వర్సెస్‌ పొంగులేటి అనే పరిస్థితి నెలకొని ఉందట. ఆ వివరాలు..

కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ప్రకటన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరో 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ నియోజకవర్గం టికెట్‌ కేటాయింపు అంశం కారణంగా ప్రస్తుతం కాం​గ్రెస్‌లో రేవంత్‌రెడ్డి వర్సెస్‌ పొంగులేటి అనే పరిస్థితి నెలకొని ఉందట. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత అది మరింత ముదిరింది. టికెట్‌ ఆశించి.. రాని వారు.. బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇక టికెట్ల కేటాయింపు తర్వాత.. పార్టీల్లో అసంతృప్త నేతల వల్ల కొత్త తలనొప్పులు ప్రారంభం అవుతున్నాయి. మిగతా పార్టీలతో పోలిస్తే.. కాంగ్రెస్‌లో ఈ తలనొప్పులు మరింత ఎక్కువగా ఉన్నాయి. హస్తం పార్టీలో అభ్యర్థుల ప్రకటన ఇంకా పూర్తి కాలేదు కానీ.. సీనియర్ల మధ్య వార్‌ నడుస్తోందట. తాజాగా ఓ నియోజకవర్గం టికెట్‌ కేటాయింపు అంశంలో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్‌లో పొంగులేటి వర్సెస్‌ రేవంత్‌రెడ్డి అన్న పరస్థితి నెలకొంది అంటున్నారు. ఆ వివరాలు

తుంగతుర్తి టికెట్ విషయంలో ప్రసుత్తం కాంగ్రెస్‌ అగ్రనేతలు పొంగులేటి, రేవంత్ రెడ్డి మధ్య వార్‌ నడుస్తోందని తెలుస్తోంది. తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకర్‌కు కేటాయించాలని రేవంత్ రెడ్డి పట్టు పడుతుండగా.. పొంగులేటి మాత్రం.. ఆ టికెట్‌ను పిడమర్తి రవికి ఇవ్వాలని కోరుతున్నాడట. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఈ టికెట్‌ను మోత్కుపల్లి నర్సింహులుకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చివరకు అధిష్టానం ఈ టికెట్‌ను ఎవరికి కేటాయిస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం తుంగతుర్తి టికెట్‌ మాత్రం పార్టీలోని కీలక నేతల మధ్య అగ్గి రాజేసింది అంటున్నారు కార్యకర్తలు.

సూర్యాపేట, సత్తుపల్లిలో ఇదే సీన్‌..

మరో నియోజకవర్గం సూర్యాపేటలో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రేవంత్, పొంగులేటి ఇద్దరు.. పటేల్ రమేశ్ రెడ్డికి తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు.. దామోదర్‌ రెడ్డికి సపోర్ట్‌ చేస్తున్నారు. దాంతో ఇక్కడ కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులే నెలకొని ఉన్నాయి అంటున్నారు. మరోవైపు సత్తుపల్లి టికెట్‌ను కొండూరు సుధాకర్‌కి ఇవ్వాలంటూ.. పొంగులేటి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.

కానీ రేణుకా చౌదరి మాత్రం మట్టా దయానంద్ భార్యకు సత్తుపల్లి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే పటాన్‌చెరు టికెట్‌ విషయంలో కూడా సీనియర్లు ఇలానే పట్టుబడుతున్నారు. దీని కోసం మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహా.. పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉండటంతో.. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారు సీనియర్లు.

తుంగతుర్తి, సత్తుపల్లి, పటాన్ చెరు, సూర్యాపేట నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతుండటం కాంగ్రెస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. మరి ఢిల్లీ పెద్దలు చివరకు వీరిలో ఎవరి వాదనకు మొగ్గుచూపుతారో.. ఏ స్థానాల్లో ఎవరి అనుచరులకు టికెట్ కేటాయిస్తారో తేలాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాలి. టికెట్ల కేటాయింపు పూర్తయ్యాక.. రెబల్స్‌ని ఎలా బుజ్జగిస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు.

Show comments