iDreamPost

ట్యాబ్లెట్‌ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగిన మహిళ!

ట్యాబ్లెట్‌ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగిన మహిళ!

కొత్తపుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో అసాధ్యాలు ఎన్నో సుసాధ్యాలుగా మారుతున్నాయి. ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చేసింది. అవసరాలకు తగ్గట్టుగా మరింత సౌకర్యవంతంగా అన్ని వస్తువులు డిజైన్‌ చేయబడుతూ ఉన్నాయి. టెక్నాలజీ తాలూకా అద్భుత ఆవిస్కరణలలో ఎయిర్‌పాడ్స్‌ కూడా ఓ భాగమే. ఎలాంటి జంజాటం, ఇబ్బంది లేకుండా చెవిలో ఇమిడిపోయేలా ఉండే ఇవి.. ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. కొన్ని సార్లు వీటి చిన్న రూపం కారణంగా మనుషులకు ఇబ్బందులు తప్పటంలేదు. ఇందుకు తాజా, ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.

ఓ మహిళ ట్యాబ్లెట్‌ అనుకుని పొరపాటున భర్త ఎయిర్‌ పాడ్‌ను మింగేసింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. 52 ఏళ్ల టాన్నా బార్కర్‌ అమెరికాలోని ఉతాలో నివాసం ఉంటోంది. కొద్దిరోజుల క్రితం ఆమె తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో విటమిన్‌ ట్యాబ్లెట్లు ఆమె చేతిలో ఉన్నాయి. వాటితో పాటు భర్త యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ కూడా చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొరపాటున విటమిన్‌ ట్యాబ్లెట్లకు బదులు ఓ ఎయిర్‌ పాడును నోట్లో వేసుకుని మింగేసింది. ముందుగానే నోట్లో నీళ్లు ఉండటంతో ఎయిర్‌ పాడ్‌ నీటితో పాటు సర్రున గొంతులోకి వెళ్లిపోయింది.

అసలు విషయం తెలుసుకున్న ఆమె కంగారుపడిపోయింది. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి డాక్టర్లను సంప్రదించి, విషయం చెప్పింది. డాక్టర్లు ఆమెకు ఏమీ కాదని, ఉదయం సహజ పద్దతిలో బయటకు వస్తుందని నచ్చచెప్పి పంపేశారు. వారు చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయం ఎయిర్‌పాడ్‌ బయటకు వచ్చేసింది. ఆమె ఊపిరి పీల్చుకుంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి