iDreamPost
android-app
ios-app

పొరపాటును సరిదిద్దుకున్నా.. రఘురామరాజు రచ్చ

  • Published Aug 25, 2021 | 2:39 PM Updated Updated Aug 25, 2021 | 2:39 PM
పొరపాటును సరిదిద్దుకున్నా.. రఘురామరాజు రచ్చ

ప్రజలకు తాజా సమాచారం అందించేందుకు మీడియా కాలంతో పోటీ పడుతోంది. తనతో తనూ పోటీపడుతోంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పరుగు వేగం మరింత పెరిగింది. వేగంలో తొట్రుపడటం ఎవరికైనా సహజం. మీడియా విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి. సీఎం జగన్ బెయిల్ రద్దు కేసుకు సంబంధించి కూడా అదే జరిగింది. బుధవారం ఆ కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే అది వాయిదా పడింది. కానీ బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కొట్టివేసినట్లు ఎవరు మొదట ప్రచారం ప్రారంభించారో గానీ అది పలు మీడియాల ద్వారా వ్యాప్తి చెందింది. కొద్దిసేపటికే అది వాస్తవం కాదని తెలుసుకున్న మీడియా సంస్థలు వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నాయి. కేసు వాయిదా పడిన విషయాన్ని ప్రసారం చేశాయి. అయితే ఈ చిన్న విషయాన్ని పట్టుకొని పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు రచ్చ చేస్తున్నారు.

ఆ కేసులో ఏం జరిగింది

వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కొన్నాళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణ జులై చివరి వారంలోనే ముగిసింది. తుది తీర్పును న్యాయమూర్తి ఆగస్టు 25కు వాయిదా వేశారు. దాంతో బుధవారం తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ రఘురామ దాఖలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ బుధవారం ముగిసింది. ఈ రెండు కేసుల తుది తీర్పును కోర్టు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : వైఎస్సార్సీపీ వైపు మళ్లీ బొబ్బిలి రాజుల చూపు!

కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను కోర్టు కొట్టివేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్తనే కొన్ని మీడియా సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాయి. అదే క్రమంలో సాక్షి మీడియా తన ట్విటర్ ఖాతాల్లో పోస్టు పెట్టింది. వీ 6 చానల్ తన ఫేస్ బుక్ అకౌంటులో అదే తరహా పోస్టు పెట్టింది. మరికొన్ని మీడియా సంస్థలు కూడా అదే పని చేశాయి. అయితే కేసు కొట్టివేయలేదని, తీర్పును మరోసారి వాయిదా వేశారని నిర్ధారణ కావడంతో వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నాయి. పాత పోస్టును తొలగించి కేసు వాయిదా పడిందన్న పోస్టు పెడుతూ క్షమాపణలు కూడా కోరాయి. కానీ రఘురామకృష్ణరాజుకు ఇవేవీ కనబడలేదు. ఒక్క సాక్షి మీడియానే టార్గెట్ చేస్తూ రచ్చ చేశారు. తీర్పు రాకుండానే కేసు కొట్టివేసినట్లు సాక్షి ఎలా రాసిందని ప్రశ్నిస్తూ.. సాక్షి విలేఖరికి ఆ విషయం ఎవరు చెప్పారంటూ హడావుడి చేశారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొరపాటు జరిగినా.. వెంటనే దాన్ని సరిదిద్దుకున్న తర్వాత కూడా రచ్చ చేయడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బతికున్నవారు మరణించినట్లు రాసిన సందర్భాలు ఉన్నాయి

సోషల్ మీడియా యుగంలో చాలా వరకు ఫేక్ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొందరు అత్యుత్సాహంతో నిర్ధారించుకోకుండానే తాజా సమాచారం అందించాలన్న ఆత్రుతతో పోస్టులు పెడుతున్నారు. అవి అత్యంత వేగంగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లిపోతున్నాయి. ఆ మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన నాలుగు రోజుల తర్వాత మృతి చెందారు. మొన్నటికి మొన్న సినీ నటి శారద మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదని స్వయంగా ఆమే ప్రకటించుకోవాల్సి వచ్చింది.

ఇటీవలే సుప్రీంకోర్టు కోలీజియం సమావేశం తొమ్మిది మందిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియామకానికి సిఫార్సు చేసిన విషయంలోనూ అదే జరిగింది. ఇంకా సమావేశం జరుగుతుండగానే ఈ వార్తలు మీడియాలో రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని ఆయన మీడియాను కోరారే తప్ప చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పొరపాట్లు జరగడం సహజం. వాటిని వెంటనే సరిదిద్దుకోకపోతేనే సమస్య వస్తుంది. సీబీఐ కోర్టు తీర్పు విషయంలో మీడియా సంస్థలు పొరపాటును సరిదిద్దుకున్న తర్వాత కూడా రఘురామకృష్ణరాజు ఒకే సంస్థను ప్రస్తావిస్తూ యాగీ చేయడం విమర్శలపాలు అవుతోంది.

Also Read : అగ్రిగోల్డ్ ను ఇత్తడి చేసేశారు కదా!