ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి కార్యక్రమం. అతిథులందరూ పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఉంటారు. ఇక పెళ్లి పీటలపై వధువరులు కూర్చోని ఉండగా.. పంతులు వేద మంత్రాలు చదువుతాడు. ఇలా వరుడు.. వధువుకు తాళి కట్టే సమయంలో ఆపండి అంటూ ఓ వాయిస్ వినిపిస్తూ పెళ్లిని ఆపేస్తారు. ఇది చాలా సినిమా జరిగే రోటిన్ సీన్. అయితే అలాంటి సీన్ రీయల్ లైఫ్ లోనూ జరిగింది. పెళ్లి పీటలపై ఉన్న వధువును పోలీసులు లాక్కెళ్లారు. మరి.. ఆ వధువు ఏం చేసింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళ రాష్ట్రం కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా అనే యువతి, అఖిల్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. మతాలు వేరవడంతో ఇరు కుటుంబాల వాళ్లు వీరికి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరు ఇంట్లో నుంచి పారిపోయి… ఓ ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చోని ఉండగా పంతులు మంత్రాలు చదువుతున్నాడు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు అక్కడి వెళ్లారు. పెళ్లి పీటలపై నుంచి అల్ఫియాను బలవంతంగా కోవలం పోలీస్స్టేషన్ను తీసుకొచ్చారు. తాను రానని ఆ యువతి అరుస్తుండగా బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించారు. పెళ్లి కుమారుడు అఖిల్ ఆమె దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇదే సమయంలో ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. అల్ఫియా కన్పించకుండా పోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అల్ఫియా గుడిలో పెళ్లి చేసుకుంటుందని తెలిసి అక్కడకు వెళ్లామని, ఆమెను తీసుకొచ్చి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే అల్ఫియా మేజర్ కావడంతో అఖిల్తోనే వెళ్తానని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించిందని పోలీసులు అధికారి తెలిపారు. కాసేపటి తరువాత ఆ ప్రేమికులిద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. పోలీసుల ప్రవర్తనపై ఫిర్యాదు చేయనున్నట్లు అఖిల్, అల్ఫియా వెల్లడించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.