Idream media
Idream media
రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు ఉంటే.. అందులో 12 కార్పొరేషన్లకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలుఏ జరుగుతున్నాయి. కాకినాడ కార్పొరేషన్ పాలక మండలి గడువు ఉండడంతో మరో రెండేళ్ల తర్వాతనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీకాకుళం, రాజమహేంద్రవరంలలో విలీన గ్రామాల వివాదం నెలకొని ఉండగా.. నెల్లూరు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
నెల్లూరు నగరపాలక సంస్థలో ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారింది. డివిజన్ల మధ్య సరిహద్దుల్లో స్పష్టతలేమీ, డివిజన్ల మధ్య ఓట్లలో భారీ వ్యత్యాసం ప్రధాన సమస్యలుగా మారాయి. నగరంలో 54 డివిజన్లు ఉండగా.. డివిజన్ల మధ్య రెట్టింపు స్థాయిలో ఓట్ల తేడా కనిపిస్తోంది. ఒక డివిజన్లో 4 వేల ఓట్లు ఉంటే మరో డివిజన్లో 18 వేల ఓట్లు ఉండడంతో నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల భవితవ్యం కోర్టుకు చేరింది.
డివిజన్ల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించాని, ఓటర్ల జాబితాను డివిజన్ల వారిగా సమానంగా ఉండేలా నూతన జాబితా తాయరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
డివిజన్ల మధ్య సరిహద్దుల ఏర్పాటు, ఓటర్ల జాబితా సవరణ పనులు యంత్రంగం చేసేవే కావడంతో కోర్టు వివాదాలు త్వరలో పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కోర్టు నుంచి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలు తేలిన తర్వాత.. డివిజన్ల సరిహద్దుల గుర్తింపు, నూతన ఓటర్ల జాబితా తయారీకి మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడమే ఆలస్యం సింహపురిలో నగరపోరు జరుగుతుంది.
1884లో మున్సిపాలిటీగా ఏర్పడిన నెల్లూరు 2004లో కార్పొరేషన్గా మారింది. 54 డివిజన్లు ఉన్న కార్పొరేషన్కు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అందులో ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ పార్టీలు నెల్లూరు నగరాన్ని పాలించాయి.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు నగరపాలక సంస్థను అధికార వైసీపీ గెలుచుకోవడం లాంఛనమే. వైసీపీకి మంచి పట్టు ఉన్న జిల్లాల్లో కడప తర్వాత స్థానం నెల్లూరుదే. గడచిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానంతోపాటు 10 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఎంపీ సీటుతోపాటు పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది.
వైసీపీ బలంగా ఉండగా, టీడీపీకి నాయకత్వమే కొరవడింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన పి.నారాయణ 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఆరోపణలు వచ్చినప్పుడు వచ్చి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదిన్నరగా నారాయణ ఎవరికీ కనిపించ లేదు. టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నారాయణ పూర్తిగా సైలెంట్ కావడంతో.. టీడీపీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న మెదులుతోంది. ప్రస్తుతం నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అబ్ధుల్ అజీజ్ మాత్రమే ఆ పార్టీలో పెద్ద తలకాయలుగా కనిపిస్తున్నారు.
Read Also : కందుకూరుకు ఎన్నికలు జరిగేనా ? మహీధర్ రెడ్డి ఏమి చేస్తారు?