iDreamPost
android-app
ios-app

అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అమలాపురం కుర్రోడు

  • Published Jan 18, 2022 | 5:29 AM Updated Updated Jan 18, 2022 | 5:29 AM
అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అమలాపురం కుర్రోడు

తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించే విజయాలపై ఎన్నో కలలు కంటారు. తమ కలలు నిజంకావాలని వారు బలంగా కోరుకుంటారు. కాని కొందరికి మాత్రమే కన్న కలలు నిజమవుతాయి. ఆ తల్లిదండ్రుల విషయంలోనూ అదే జరిగింది. అంతర్జాతీయ క్రీడాకారునిగా రాణించాలనే తాను కన్న కలను తన కుమారుడు సాధించాలని ఆ తండ్రి పరితపించాడు. అందుకు తగినట్టుగానే ఆ కుర్రవాడు షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో అంతర్జాతీయ వేదికలపై తన అత్యుత్తమ ప్రదర్శనతో విజయపరంపర కొనసాగిస్తున్నాడు. తల్లిదండ్రుల కలలు నిజం చేశాడు. తాజాగా ఇండియన్‌ ఓపెన్‌ – 500 డబుల్స్‌లో విజేతగా నిలిచిన వారిలో ఒకరు రంకిరెడ్డి సాయిరాజ్‌ సాత్విక్‌. ఇతనిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కావడంతో ఆ ప్రాంతవాసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.

జాతీయ, అంతర్జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పలు విజయాలు సాధిస్తున్న సాత్విక్‌ చిన్ననాటి నుంచి షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో శిక్షణ పొందుతున్నాడు. అతని తండ్రి కాశీ విశ్వనాథ్ ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేయడమే కాకుండా హెచ్‌ఎంగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కాశీ సైతం షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కావడం విశేషం. అంతేకాదు ఆయన ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ (ఏపీబీఏ) ప్యానల్‌ రిఫరీగా సేవలందించారు. తాను మంచి క్రీడాకారునిగా పేరు తెచ్చుకున్నా జాతీయస్థాయిలోకి ఎదగలేదనే బాధ కాశీలో ఉండేది. ఈ కారణంగా తన కుమారుల్లో ఒకరినైనా అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దాలని తలపోశారు. అతని కోరికను చిన్న కుమారుడు సాత్విక్‌ తీర్చాడు.

సాత్విక్‌ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొంది రాటుదేలాడు. డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ రాణిస్తాడని నిర్ణయించిన గోపీచంద్‌ అతనికి శిక్షణ ఇచ్చాడు. డబుల్స్‌ విభాగంలో మహారాష్ట్ర కు చెందిన చిరాగ్‌ శెట్టితోను, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో అశ్వనీ పొన్నప్పతోను జతకట్టిన తరువాత సాత్విక్‌ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు విజయాలు సాధిస్తున్నాడు. వీటిలో ముఖ్యమైంది కామన్‌వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ టీం విభాగంలో స్వర్ణం, పురుషుల డబుల్స్‌ విభాగంలో రజిత పతకాలు సాధించాడు. 2016, 2020 ఆసియా ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో రజిత పతకాలు సాధించాడు.

గత ఏడాది జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్‌ డబుల్స్‌ విభాగంలో మూడు మ్యాచ్‌లకు గాను, రెండు మ్యాచ్‌లు గెలిచినా క్వార్టర్స్‌ అవకాశం రాలేదు. పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే అక్కడ కూడా పతకం సాధించేవాడు. ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకున్నాడు. ఆటపై దృష్టిపెట్టి ముమ్మరసాధన చేస్తున్నాడు. ఒలింపిక్స్‌ తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్‌ – 750లో ద్వితీయ స్థాయిలో నిలిచారు. తాజాగా ఇండియన్‌ ఓపెన్‌-500 విజేతగా నిలవడం విశేషం. సాత్విక్‌, చిరాగ్‌ శెట్టిలు అంతర్జాతీయంగా డబుల్స్‌ విభాగంలో తొమ్మిదవ ర్యాంకులో ఉన్నారు. వారు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఏడు కావడం విశేషం. అశ్వనీ పొన్నతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో 19 వ ర్యాంకులో ఉన్నారు.

Also Read : న్యూజిలాండ్‌ యూత్ ఎంపీగా తెలుగమ్మాయి