Hyderabad: ఇంటి ముందు ముగ్గు విషయంలో గొడవ.. ఒకరు బలి!

Hyderabad: ఇంటి ముందు ముగ్గు విషయంలో గొడవ.. ఒకరు బలి!

సాధారణంగా ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేసుకుంటారు? అది సంప్రదాయం అని కొందరు, ముగ్గు వేస్తే వాకిలి అందంగా ఉంటుందని కొందరు చెబుతారు. కానీ, అలాంటి ముగ్గు వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అంటే నమ్ముతారా? అవునండి ముగ్గు వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఈ దారుణం మరెక్కడో కాదు.. మహానగరం హైదరాబాద్ లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ శివాజీ నగర్ లో మాణిక్ ప్రభు కుటుంబం నివాసం ఉంటోంది. మంగళవారం తెల్లవారుజామున మాణిక్ ప్రభు తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. ఆ తర్వాత దుర్గేశ్ కుటుంబం వాకిలి కడగడంతో మాణిక్ ప్రభు వాళ్ల ఇంటిముందు ముగ్గు చెరిగిపోయింది. దాంతో మాణిక్ ప్రభు తల్లి గొడవ చేసింది. పదే పదే ముగ్గు వేసుకుంటారా అని ప్రశ్నించింది. ఈ గొడవ కాస్తా.. చినికి చినికి గాలివాన అయ్యింది. ఇంకేముందు ఇరు కుటుంబాలు బాహాబాహీకి దిగాయి.

ఈ గొడవలో దుర్గేష్ కుటుంబం చేసిన దాడిలో మాణిక్ ప్రభు మర్మాంగంపై గాయం అయింది. అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మాణిక్ ప్రభును ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గతంలో కూడా వీరి కుటుంబాల మధ్య గొడవలు అయ్యాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే దుర్గేష్ కుటుంబం ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టాయంటూ వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. నిందితుడు దుర్గేశ్ గతంలో కూడా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చాడు.

Show comments