iDreamPost
android-app
ios-app

ముస్లింల ఆహ్వానం.. మసీదుని ప్రారంభించిన హిందూ స్వామీజీ!

ముస్లింల ఆహ్వానం.. మసీదుని ప్రారంభించిన హిందూ స్వామీజీ!

భారతదేశం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా గుర్తొచ్చేది భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు ఉన్నా అంతా కలిసి మెలిసి జీవిస్తారు. ఎన్నో సంస్కృతులు, మరెన్నో సాంప్రదాయాలు ఉంటాయి. కానీ, అందరూ అన్నదమ్ముల్లా జీవిస్తుంటారు. అది చాటి చెప్పేందుకు నిత్యం ఎన్నో ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక ఘటన అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఒక హిందూ స్వామీజీ వెళ్లి మసీదుని ప్రారంభించారు.

ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కొప్పాల్ జిల్లా కుకనూర్ తాలూకా భనపూర్ లో ఆవిష్కృతమైంది. స్థానికంగా ఉన్న ముస్లింలు కొత్తగా మసీదుని నిర్మించుకున్నారు. దాని ప్రారంభోత్సవం కోసం గావి మఠాధిపతిని ఆహ్వానించారు. అభినవ గావి సిద్ధేశ్వర స్వామి కూడా వారి ఆహ్వానాన్ని మన్నించారు. ఎంతో ఆనందంగా ఆ మసీదు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి నూతన మసీదుని గావి సిద్ధేశ్వర స్వామి ప్రారంభించారు. “అందరూ కలిసి జీవించడం ఎంతో అవసరం.

నిజమైన మతం ఏదైనా సామరస్యాన్నే ప్రోత్సహిస్తుంది. తమ మతంపై విశ్వాసం లేనివాళ్లు మాత్రమే.. తమ మతమే గొప్పదని విర్రవీగుతూ ఉంటారు. వివక్ష లేకుండా ఎవరైతే అత్యవసరంలో ఉన్న వారికి రక్తదానం చేస్తారో.. వాళ్లే వారి మతాన్ని అనుసరిస్తున్నట్లు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లే వాళ్లే మతవాదులు కాదు. ఎవరినీ బాధ పెట్టకుండా, మోసం చేయకుండా జీవించడమే మతం నేర్పించే నిజమైన జీవిత సూత్రం” అంటూ స్వామీజీ వ్యాఖ్యానించారు.