చంద్రబాబు, లోకేష్‌… ధైర్యం ఉంటే నేరుగా రండి – పిన్నెల్లి సవాల్‌

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి బహిరంగంగా సవాల్‌ విసిరారు. రైతుల ముసుగులో తమపై దాడులు చేయడం కాదని, చంద్రబాబు, ఆయన కొడుకు మగాళ్లయితే నేరుగా రావాలన్నారు. రాజధాని ఉద్యమం పేరుతో మా(వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు)పై దాడి చేసి బెదిరించాలనుకుంటన్నారని, అది సాధ్యం కాదని పిన్నెళ్లి స్పష్టం చేశారు. అధికారం ఉన్నప్పుడే తనపై కేసులు పెట్టి బెదిరించాలనుకున్నారని, కానీ అప్పుడే సాధ్యం కాలేదని గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడు తనను బెదిరించడం చంద్రబాబు కాదు కదా, వాళ్ల అయ్య వల్ల కూడా కాదని ఘాటుగా స్పందించారు.

తాను పల్నాడులో పుట్టానని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడబోనని పిన్నెళ్లి పేర్కొన్నారు. దాడులతో తనను ఏమైనా చేయడం.. చంద్రబాబును పుట్టించిన వాడి వల్ల కూడా కాదన్నారు. రేపు టీడీపీ అనుకూల మీడియాలో నాపై దాడి అంటూ రాజధానిలో ఏదో జరుగుతుందని ప్రచారం చేస్తారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఇలాంటి దాడులతో చంద్రబాబు చేసే జిమ్మిక్కుల్లో తాము పడబోమని, ప్రశాంతంగా ఉంటామని చెప్పారు.

స్వలాభం, ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు రైతులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారని పిన్నెల్లి మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్‌లో రైతులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, డిమాండ్లు, సమస్యలుఏమైనా సరే నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమవ్వాలని సూచించారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ రాజకీయ నాయకుడన్న పిన్నెల్లి అతన్ని సొంత పార్టీ నేతలే నమ్మడంలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తన మనవడితో కూడా ఆడుకునేందుకు కూడా తీరికలేకుండా పని చేశానని చెప్పుకున్న చంద్రబాబు ఇలాంటి కుట్రలు మానుకుని ఇకనైనా మనవడితో ఆడుకోవాలని సలహా ఇచ్చారు.

Show comments