iDreamPost
android-app
ios-app

మొన్న మాచర్ల , నిన్న నరసరావుపేట , రేపు ? కొత్త రూపం దాల్చిన టీడీపీ కపట రాజకీయం …

  • Published Jan 17, 2022 | 4:00 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
మొన్న మాచర్ల , నిన్న నరసరావుపేట , రేపు ?  కొత్త రూపం దాల్చిన టీడీపీ కపట రాజకీయం …

పల్నాడులో పట్టు పెంచుకోవడం కోసం టీడీపీ హత్యా రాజకీయాలు , దుష్ప్రచారం , అల్లర్లు దారిగా ఎంచుకుందా ..

2019 సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఓటమి పాలైన టీడీపీ నాటి నుండి అధికార వైసీపీ పై అసహనంతో ఏదోక రూపంలో ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది . అంతేగాక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే నిశ్చయంతో ఉన్న బాబు ఇప్పటినుండే నియోజక వర్గాల వారీగా బలహీనంగా ఉన్న చోట్ల కొత్త అభ్యర్థులను ఇంచార్జ్ లుగా ఎంపిక చేయనారంభించారు.  గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం నుండి వివాదాస్పదుడైన తీవ్ర ఫ్యాక్షన్ నేేపథ్యం ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇంచార్జ్ గా ప్రకటించడం ద్వారా ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టిన బాబు తర్వాత నరసరావుపేట పై దృష్టి సారించారు .

గత ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లని కోల్పోయి అసలు ప్రాతినిథ్యం లేకపోవడంతో పాటు ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా పేరు పడ్డ నరసరావుపేటలో 32000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఓడిపోయి దిక్కుతోచని చంద్రబాబుకి స్థానిక ఎన్నికలన్నీ ఏకపక్షంగా భారీ మెజారిటీతో గెలుచుకోవడం , కొన్ని చోట్ల టీడీపీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు . మరోవైపు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనతో జగన్ పట్ల రోజురోజుకీ పెరుగుతున్న ప్రజాభిమానం చూసి ఓర్వలేక , ప్రభుత్వం పై పోరాటానికి ప్రజా సమస్యలు దొరక్క కుట్ర , కుతంత్రాలతో దుష్ప్రచారానికి తెరతీశారని ఇటీవలి పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోంది .

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళల్లో సినీ ఆర్టిస్ట్ ల చేత అసత్య ప్రచారాలతో కూడిన వీడియోలు చేయించడం , స్వయంగా లోకేష్ సహా పలువురు టీడీపీ మాజీ మంత్రులు సోషల్ మీడియా వేదికగా ఎడిటెడ్ వీడియోలతో దుష్ప్రచారం చేయడం , ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనల తాలూకూ వీడియోలు తెచ్చి ఏపీలో జరిగినట్లుగా చూపించడం చేసినా ప్రజల నమ్మకం పొందలేకపోయారు . ఆ తర్వాత దేవాలయాలలో చోరీలు , విగ్రహాల పై , మతాచారాల పై కూడా అపచారాలు అంటూ వైసీపీ పై అసత్య ప్రచారాలు చేసినా , ఏకంగా ముఖ్యమంత్రికి మతతత్వాలు అంటగట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో స్థానిక విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలకు తెర లేపింది టీడీపీ నాయకత్వం .

ఇందులో భాగంగా తొలి ప్రయోగానికి పల్నాడు నుండి శ్రీకారం చుట్టారు చంద్రబాబు . ఇటీవల మాచర్లలో ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో జరిగిన హత్యను వైసీపీ పార్టీకి ఆపాదిస్తూ తీవ్ర దుష్ప్రచారం చేసిన బాబు వందల కార్లతో ర్యాలీగా వెళ్లి అలజడి సృష్టించటానికి చేసిన కుట్ర బయటపడినా ఏ మాత్రం వెరవకుండా వెంటనే నరసరావుపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేసి గొడవలకు పూనుకోవడం చూస్తుంటే ముందు ముందు ఇంకెన్ని చేయనున్నారో అనిపించక మానదు .

ఇటీవల జొన్నలగడ్డ గ్రామంలో వైసీపీ విగ్రహాన్ని కొందరు దుండగులు మాయం చేసిన ఘటనలో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలన , పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత ఇరువురు అనుమానితులను పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకోగా , మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ రాష్ట్ర రహదారుల పై ధర్నా పేరిట అల్లర్లకు పాల్పడటమే కాకుండా , విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు అడ్డుకొంటున్న పోలీసులు తనను గుండెల పై తన్నారు అంటూ స్థానిక తాత్కాలిక టీడీపీ ఇంచార్జ్ అరవింద బాబు సంచలన ఆరోపణలు చేశారు .

సుదీర్ఘ సమయం నుండి చేస్తున్న ధర్నా మూలంగా ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోవడంతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున తాము అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశామే కానీ భౌతిక దాడికి పాల్పడలేదని పోలీసుశాఖ వివరించింది . ధర్నా , అల్లర్ల తాలూకూ ప్రతి క్షణాన్ని రికార్డ్ చేసిన టీడీపీ నేతలు ఆ ఘటన తాలూకూ వీడియో రికార్డ్ లేకుండా కేవలం స్పృహ తప్పినట్టు పడుకొన్న వీడియో మాత్రమే చూపిస్తున్నారు . శ్వాసఆడని స్థాయిలో దెబ్బ తగిలింది అని టీడీపీ వారు చెబుతున్న ప్రకారం చూస్తే అరవింద బాబు వేసుకున్న చొక్కా పై ముద్ర , శరీరం పై గాయం అయ్యి ఉండొచ్చు . అలాంటివేవీ లేకుండానే కేవలం రాజకీయ లబ్దికోసం టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పోలీసు వర్గాల వాదన .

ఈ అంశం పై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక టీడీపీ ఇంచార్జ్ అరవిందబాబు పోలీసుల పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని , పోలీసులు తన్నటం వలన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళానంటున్న అరవింద బాబు రెగ్యులర్ పల్మానాలజిస్ట్ , ఆధునిక సౌకర్యాలు లేని , టీడీపీ పార్టీకి చెందిన సాధారణ హాస్పిటల్ లో ఎలా చేరారు . నిజంగా పోలీసులు భౌతిక దాడి చేసి ఉంటే ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చేరి సాక్ష్యాలు సమర్పించి చర్యలు తీసుకోమని పై అధికారులని కోరాలి కదా అంటూ ప్రశ్నలు సంధించారు .

ఈ విషయంలోనే కాదు పల్నాడు ప్రాంతంలో టీడీపీ ఆరోపణలు చేసిన ప్రతి ఘటనలోనూ అంతిమంగా టీడీపీ నేతలే కుట్రదారులు అని బయటపడుతున్నాయి . మాచర్ల తోట చంద్రయ్య హత్య విషయంలో పోలీసులు గంటల వ్యవధిలో నిందితులను పట్టుకొని ప్రాథమిక విచారణ అనంతరం ఇరు వర్గాల పాత కక్షలు అని తేల్చగా , జొన్నలగడ్డలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం మాయం చేసిన కేసులో సిసి ఫుటేజీ ఆధారంగా విచారించి ఇరువురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు . చివరికి పోలీసు విచారణను కూడా వివాదాస్పదం చేయడానికి పూనుకున్నారు .

చీమ చిటుక్కుమన్నా వైసీపీ కారణం అంటూ నోరేసుకు పడిపోయే నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ గతంలో సొంత వ్యాపార భాగస్వామిని మణికొండలో హత్య చేసిన కేసులో నిందితుడు . 2009 ఎన్నికల ముందు నరసరావుపేట టీడీపీ కార్యకర్త హాయగ్రీవని హత్య చేసి తగలబెట్టిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు నాటి టీడీపీ నేతలు . ఎన్నికల అనంతరం నాటి టీడీపీ అభ్యర్థి ప్రధాన అనుచరుడే నిందితుడని కేవలం ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని విచారణలో తేలిందన్నారు . పల్నాడులో అల్లర్లు రేపి లబ్ది పొందే కుట్రలో భాగంగా ప్రస్తుతం మాచర్ల టీడీపీ ఇంచార్జ్ గా నియమించిన వ్యక్తి టీడీపీ అధికారంలో ఉన్న 2001 లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ఏడు హత్యల కేసులో ప్రధాన ముద్దాయని నాడు ఈ హత్యల పై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మాట్లాడుతూ ఫ్యాక్షన్ రాజకీయాల పేరిట బంధువులని చంపుకొన్న దుర్మార్గం పై టీడీపీ నేతల్ని ఎండగట్టిన వీడియోలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయన్నారు .

కేవలం ప్రజల్లో సానుభూతి కోసం , రాబోయే ఎన్నికల్లో లబ్దికోసం టీడీపీ నాయకత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలని ప్రోత్సహిస్తుంటే , టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పదవులు కాపాడుకోవడం కోసం , వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఆశించే ఆశావహుల్లో మెరుగైన అభ్యర్థి అని చంద్రబాబు దృష్టిలో పడడం కోసం అరవిందబాబు లాంటి వ్యక్తులు విగ్రహాలు మాయం చేయడం , అల్లర్లు సృష్టించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

ఇలా ప్రతి విషయంలోనూ వాళ్లే దోషులుగా ఉండి వైసీపీ పై అభాండాలు వేయడం టీడీపీకి నిత్యకృత్యం అయ్యుండొచ్చు కానీ వాటిని నమ్మటానికి ప్రజలు అమాయకులు కారు . ఎల్లో మీడియా తప్ప మరో మీడియా అందుబాటులో లేని కాలం కాదు . ప్రజలు అన్నీ గమనిస్తున్నారు , ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు చట్టబద్ధంగా తగిన చర్యలు చేపడతాం అని తేల్చిచెప్పారు .