Dharani
Dharani
కొన్ని కొన్ని సార్లు.. శాస్త్రవేత్తలు, సైన్స్కు అంతుపట్టని ఎన్నో వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎందుకు అలా జరుగుతున్నాయో.. వాటికి గల కారణాలను ఎవరు వివరించలేరు. సైన్స్ కూడా చేతులెత్తేసే ఆ ఘటనలనే దైవుడి మహిమ అంటారు. అయితే టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఇలాంటి వింతలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిల్లో నూటికి 99 శాతం ఫేక్ అయి ఉంటాయి. కానీ కొన్ని వింత సంఘటనలు మాత్రం వాస్తవంగానే చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికి కారణాలను కూడా మనం అన్వేశించలేము. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తీసేయాలని తీర్పు ఇవ్వగా.. పక్కనే ఉండి దాన్ని రికార్డు చేస్తోన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మూర్ఛపోయాడు. దాంతో జడ్జి వెంటనే తీర్పు మార్చాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన పశ్చిమబెంగాల్, కోల్కతా హైకోర్టులో చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాలంటూ తీర్పు వెల్లడించిన వెంటనే అసిస్టెంట్ రిజిస్ట్రార్ మూర్ఛపోయారు. దాంతో వెంటనే శివలింగాన్ని తొలగించాలనే తన తీర్పును ఉపసంహరించుకున్న జస్టిస్ జోయ్ సేన్గుప్తా.. ఈ వివాదాన్ని దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని ఇరు వర్గారలకు సూచించారు. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోజాలదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట వైరల్గా మారింది.
పశ్చిమ్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా ఖిదిర్పూర్కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య గత కొంత కాలంగా ఓ స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించి గతేడాది మేలో ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. చినికి చినికి గాలి వానలా మారి.. చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని భావించిన గోవింద్ మండల్ రాత్రికి రాత్రే ఓ శివలింగాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సుదీప్ పాల్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా సరే వారు పట్టించుకోలేదు. దీంతో సుదీప్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు.
తాజాగా కోల్కతా హైకోర్టు ఈ స్థలం వివాదంపై విచారణ చేపట్టింది. జస్టిస్ జోయ్ సేన్ గుప్తా ధర్మాసనం ముందు గోవింద్ మండల్ తరఫున మృత్యుంజయ్ ఛటోపాధ్యాయ్ అనే లాయర్ తన వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఆ శివలింగాన్ని తెచ్చిపెట్టలేదని, అది స్వయంభూ లింగమని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ సేన్ గుప్తా తీర్పును వెలువరించారు. వివాదాస్పద స్థలం నుంచి శివలింగాన్ని తొలగించాలని తీర్పులో వెల్లడించారు. జస్టిస్ సేన్ గుప్తా వెల్లడించిన ఈ తీర్పునే పక్కనే ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ రికార్డు చేస్తుండగా.. అనుకోని వింత చోటు చేసుకుంది. తీర్పును రికార్డు చేస్తోన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మూర్ఛపోయాడు.
ఊహించని ఈ పరిణామంతో కోర్టులో ఉన్న వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జరిగిన పరిణామంతో.. న్యాయమూర్తి వెంటనే తన తీర్పును మార్చేశారు. శివలింగాన్ని తొలగించాలన్ని ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ.. ఈ విషయంలో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని కోరారు. దాంతో ఈ సివిల్ వివాదాన్ని కింది న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని సూచించారు. న్యాయమూర్తి క్షణాల్లోనే తన తీర్పును మార్చుకోవడంతో కోర్టు హాలులో ఉన్న లాయర్లు సహా అందరూ విస్తుపోయారు. అంత శివలింగం మహిమ అంటూ కొనియాడుతున్నారు.