Dharani
Dharani
హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించి ఉండాల్సింది కాదని అన్నారు. దేశ విభజన చారిత్రక తప్పిదమన్నారు. చారిత్రాత్మకంగా చూసుకుంటూ.. భారతదేశం ఒకే దేశమని.. కానీ దురదృష్టవశాత్తూ విభజనకు గురైందని.. అలా జరిగి ఉండకుంటే బాగుండేదన్నారు ఒవైసీ. అయితే ఇంత సడెన్గా ఓవైసీ ఎందుకు దేశ విభజన అంశం మీద స్పందించారు అంటే.. ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య.. దేశ విభజన మహ్మద్ అలీ జిన్నా వల్ల కాదని, హిందూ మహాసభ డిమాండ్ మేరకే భారత్, పాకిస్థాన్లు ఏర్పాటయ్యాయంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఓవైసీని మీడియా ప్రశ్నించడంతో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను ఒక్కటే చెప్పగలను.. కావాలంటే.. దీనిపై చర్చ నిర్వహించి.. దేశ విభజనకు అసలు బాధ్యులు ఎవరో చెప్పమన్నా చెబుతాను. ఈ దేశాన్ని విభజించి ఉండాల్సింది కాదు.. విభజన తప్పు. అందుకు బాధ్యులు ఆ సమయంలో ఉన్న రాజకీయ నేతలు. దేశ విభజన సమయంలో అక్కడ ఉన్న నేతలంతా ఇందుకు బాధ్యులని.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకాన్ని చదివితే అర్థం అవుతుంది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ నేతలందరి దగ్గరకు వెళ్లి.. విభజన ప్రతిపాదనను అంగీకరించవద్దని ఎలా అభ్యర్థించారో అర్థం అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
వచ్చే నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఓటింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఓవైసీ.. బీజేపీతో పాటు కాంగ్రెస్పై కూడా విమర్శలు చేస్తున్నారు.