Idream media
Idream media
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి పెంచడం, ఉద్యోగాలు, ప్రాజెక్టుల కల్పనే కాదు.. పొదుపు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మొదటి నుంచే ఈ విషయాన్ని గ్రహించారు. సమావేశాల నిర్వహణలో తీసుకునే చర్యల ద్వారా ఇది స్పష్టం అవుతుంది. గత పాలకుల హయాంలో సమావేశాలకే అధికంగా వెచ్చించేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వృథా ఖర్చులు తగ్గించాలని, అవసరమైన వాటిపై దృష్టి సారించి.. అనవసరంగా దుబారా చేయవద్దని సూచించారు. రూపాయి.. రూపాయే మరో పథకానికి దోహదపడుతుందనే ఆలోచన కలిగించారు. ఇప్పుడు తాజాగా విద్యుత్ పొదుపు అనేది ఏపీలో ఒక ఉద్యమంగా కొనసాగుతోంది. సామాజిక ఉద్యమాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రతీ అంశంపైనా జగన్ దృష్టి కేంద్రీకరించడం నిపుణుల ప్రశంసలు అందుకుంటోంది.
వృథా వద్దు.. ఆదా ముద్దు..
విద్యుత్ విలువైంది.. వృథా కాకుండా కాపాడుకుందాం.. అంటూ ఇంధన పొదుపుపై ఏపీ ప్రభుత్వం ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఇందుకు వేదికగా చేసుకుంటోంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. విద్యుత్ ఆదాకు గల అవకాశాలను, ఏం చేయాలో తెలిపే సూచనలను ప్రజలకు తెలియజేస్తోంది. 3 స్టార్ లేదా 5 స్టార్ రేటెడ్ గృహోపకరణాలను వాడుదాం.. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా.. బిల్లు ఆదా చేద్దాం.. వంటి సూచనలను ప్రజలకు తెలుపుతోంది. ప్రతి జిల్లాలోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కృష్ణాజిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏపీలో ఇంధన పొదుపు, సమర్థ వినియోగం మన జీవనశైలిలో భాగం కావాలని సూచించారు. ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి రూ.7.20 ఖర్చవుతుందన్నారు. రాష్ట్రంలో ఏటా 60 వేల మిలియన్ల యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని, ఇందుకు రూ.42 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ‘నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో పాటు ఇంధన పరిరక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రతి గృహిణి ఇంధన పొదుపు ఉద్యమాన్ని చేపడితే మంచి ఫలితాలు వస్తాయి. భూతాపం, వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోగలమ’ని శ్రీకాంత్ వివరించారు.
ఇలా ఇందన పొదుపు వారోత్సవాల సందర్భంగా విద్యుత్ కు చేస్తున్న వ్యయం.. వృథా కాకుండా చేపట్టాల్సిన చర్యలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు పోస్టర్ల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. అంతేకాదు.. ఇంధన పొదుపు జాతీయ వారోత్సవాల సందర్భంగా.. ఇంధన పొదుపు కార్యక్రమాలు బాగా అమలు చేసిన వారికి అవార్డులు ఇవ్వాలని కూడా ఇంధన సంరక్షణ మిషన్ నిర్ణయించింది.