బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న రైలు.. ఏం జరిగిందంటే..?

జీవనోపాధి, విద్య, ఉద్యోగం అంటూ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు బెంగళూరు నగరానికి వచ్చి చేరుతున్నారు. దీంతో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇక అక్కడి కష్టాలు చెప్పనలనివి కావు. రద్దీతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ సారి ఏకంగా..

జీవనోపాధి, విద్య, ఉద్యోగం అంటూ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు బెంగళూరు నగరానికి వచ్చి చేరుతున్నారు. దీంతో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇక అక్కడి కష్టాలు చెప్పనలనివి కావు. రద్దీతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ సారి ఏకంగా..

ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాహనదారులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నరకయాతన చూడాల్సిందే. కొద్ది పాటి దూరానికే చుక్కలు కనబడుతుంటాయి నగర వాసులకు. ఎక్కడ బడితే అక్కడ ట్రాఫిక్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు స్థానికులు. దీంతో చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ అక్కసును వెళ్లగక్కుతుంటారు. ఇక్కడ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడటం లేదు. బారులు తీరిన వాహనాల క్యూతో బావురుమంటున్నారు ప్రయాణీకులు. సాధారణంగా ట్రాఫిక్ సమస్యల్లో కార్లు, బైకులు, లారీలు, బస్సులు ఇరుక్కుపోవడం చూశాం కానీ రైలు ఇరుక్కుపోవడం గురించి చూశారా..? కనీసం విన్నారా..? అదే మరీ బెంగళూరు ట్రాఫిక్ స్పెషల్ అంటే.. ఈ రద్దీ నుండి రైలు కూడా తప్పించుకోలేకపోయింది.

ఏంటీ.. రైలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడమేమిటీ అని సందేహం వ్యక్తం చేస్తున్నారా..? ఇంతకు ఏం జరిగిందంటే.. బెంగళూరు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో మున్నెకోలల రైల్వే గేట్ వద్ద రైలు ఆగిపోయింది. దీన్ని వీడియో తీసిన నెటిజన్లు.. బెంగళూరు ట్రాఫిక్ నుండి ట్రైన్ కూడా తప్పించుకోలేదంటూ ఫన్నీ ఎమోజీలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఆ రైల్వే గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాక్ మీద రైలు ఆగి ఉండగా.. గేటు లిఫ్ట్ చేసి ఉంది. ట్రాఫిక్ కారణంగా వాహనాలు సైతం ట్రాక్ పై ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో మరోసారి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర చర్చకు తెరలేపింది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. కుందనహళ్లి నుండి ఏకో స్పెస్ వెళ్లేందుకు తనకు గంటకు పైగా పట్టిందని విప్లవ్ దాస్ అనే నెటిజన్ రాసుకొచ్చాడు .

ఈ రూట్ లో ట్రాఫిక్ ఇలానే ఉంటుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. ట్రాఫిక్ విషయంలో ఈక్వాలిటీ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు మరో నెటిజన్. ఇదిలా ఉంటే.. ఈ వీడియో రైల్వే అధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో స్పందించారు అధికారులు. ట్రాఫిక్ కారణంగా రైలు.. పట్టాలపై ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతోనే లోకో పైలట్ ఆ రైలును నిలిపివేసినట్లు వెల్లడించారు. ట్రైన్‌లో ఏదో శబ్దం రావడంతో భద్రతాపరమైన తనిఖీల కోసం పట్టాలపై దాన్ని నిలిపివేసి.. తనిఖీ చేశారని, ఎలాంటి సమస్య లేదని గుర్తించినట్లు చెప్పారు. చెకింగ్ నిమిత్తం రైలును నిలిపివేయడంతోనే.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న గేట్ మేన్.. గేటును ఓపెన్ చేసి.. వాహనాలు అటు ఇటు వెళ్లేలా చేసినట్లు వివరించారు. ఏదేమైనప్పటికీ.. ఈ వార్త మరోసారి బెంగళూరు ట్రాఫిక్ గురించి చర్చించేలా చేసింది. మీకు ఎదురైన అత్యంత భయానక ట్రాఫిక్ కష్టాల గురించి మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి.

Show comments