‘బలగం’ సర్పంచ్ కన్నుమూత.. డైరెక్టర్ ఎమోషనల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నటుడు కన్నుమూశారు. ఈ విషయాన్ని బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తక్కువ బడ్జెట్ తో రూపుదిద్దుకుని చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కలెక్షన్లతో పాటు కనీ విని ఎరుగని రీతిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుని ఔరా అనిపించింది. వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించగా, మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్‌ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు.

బలగం సినిమాలో పల్లె జీవితాన్ని, మానవ సంబంధాలను, కుటుంబ వ్యవస్థను, ఆప్యాయతానురాగాలను కళ్లకుకట్టినట్లు చూపించారు డైరెక్టర్ వేణు యెల్దండి. దీంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. గ్రామాల్లో బలగం సినిమాను జనం అంతా ఒకచోటుకి చేరి తిలకించిన తీరు ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కాగా బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం తాజాగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తూ పోస్ట్ పెట్టారు వేణు. డైరెక్టర్ వేణు యెల్దండి ఎమోషనల్ అవుతూ.. నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి.. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం అంటూ భావోద్వేగానికిలోనయ్యాడు.

Show comments