అత్యంత అరుదైన చేప.. అచ్చం మనిషిలాగే పళ్లు!

కొన్ని సార్లు జంతు ప్రపంచం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటుంది. కొన్ని జంతువుల ప్రవర్తన.. శరీర నిర్మాణం మనుషుల్ని పోలి ఉండటం మనల్ని షాక్‌కు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ చేప అచ్చం మనిషిలాంటి పళ్లను కలిగి ఉంది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన చార్లీ క్లింటన్‌ అనే బాలుడు కొద్ది రోజుల క్రితం చేపలు పట్టడానికి వెళ్లాడు. తన ఇంటికి దగ్గరలోని ఓ కొలను చేపలు పడుతూ ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అతడి గాలానికి ఓ చేప దొరికింది. చేప నోట్లో చిక్కిన గాలాన్ని తీస్తున్న సమయంలో అతడికి ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. దాని నోట్లో మనిషిని పోలిన పళ్లు ఉండటంతో ఆశ్చర్యపోయాడు. ఆ చేపతో ఫొటోలు దిగి తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశాడు. ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. ఇక, ఓక్లహామా డిపార్ట్‌మెంట్‌ వైల్డ్‌ లైప్‌ కన్‌సర్వేషన్‌ వాళ్లు ఆ ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ చేప ‘‘పకు’’ అనే జాతికి చెందిన చేపగా చెప్పారు.

ఈ చేపలు పిరానా చేపల జాతికి చెందినవని అన్నారు. పకు చేపలు గతంలో కూడా చాలా సార్లు మనుషులకు చిక్కాయని వారు తెలిపారు. జనం వీటిని తినటాని కంటే ఎక్కువగా పెంచుకోవటానికి ఆసక్తి చూపుతారని వెల్లడించారు. ఇవి పెద్దగా పెరిగిన తర్వాత వాటిని బయట వదిలేస్తారని తెలిపారు. పకు చేపల కారణంగా ఎకో సిస్టమ్‌కు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. మరి, బాలుడి వలకు చిక్కిన మనిషి పళ్లున్న పకు చేపపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments