iDreamPost
android-app
ios-app

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన లారీ!

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన లారీ!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. ఎందరో అమాయకులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. ఇక తాజాగా ఓ ప్రమాదం తండ్రీ కొడుకులను విడదీసింది. ఓ లారీ ప్రమాదంలో తండ్రీ దుర్మరణం చెందగా, కొడుకు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..

ములుగు జిల్లాలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. ములుగు రూరల్ మండలం అబ్బాపురం పరిధి బాణాలపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మైనింగ్‌ క్వారీలోకి ఏపీ 24 టీబీ 0514 నంబరు గల లారీ మట్టి కోసం వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో బాణాలపల్లి గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఆ గ్రామం సమీపంలో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి లారీ దూసుకెళ్లింది. దీంతో హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ సాధిక్‌ పాషా(45) దుర్మరణం చెందాడు. అతడి కుమారుడు ఆస్రిఫ్‌(16) కాలువ నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ సాధిక్‌ పాషా మృతదేహాన్ని బయటకు తీశారు. ఆస్రిఫ్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం సాధిక్ పాషా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.