తల్లిని చంపిన పాపం.. కొడుకు రూపంలో వెంటాది..!

తల్లిని చంపిన పాపం.. కొడుకు రూపంలో వెంటాది..!

ఒకప్పుడు డబ్బు కంటే మానవ సంబంధాలకు, మానవత్వానికి విలువ ఉండేది. కాలంలోని మార్పుతో పాటు మనిషిలోని మానవత్వం చనిపోతుంది. ఎంతలా అంటే మనిషి ప్రాణం కంటే డబ్బే ముఖ్యం అనేంతలా చాలా మంది  ప్రవర్తిస్తున్నారు. ఇక ఈ డబ్బు చేసే దారుణాలకు లెక్కే లేదు. చివరకు ఈ డబ్బు కోసం కన్నతల్లిని చంపేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదు. ఆస్తి కోసం కన్నతల్లిని అత్యంత దారుణంగా చంపాడు కుమారుడు. అయితే ఇక్కడ ఓ ట్వీస్ట్ ఉంది. ఇప్పుడు కొడుకు చేతిలో చనిపోయిన మహిళ..గతంలో తన తల్లిని కూడా ఆస్తి కోసం హత్య చేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లా  హవేలిఘనపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన బాలమణి, కిషన్ దంపతులకు నర్సమ్మ(45) అనే  ఒక్కాగానొక్క కుమార్తె ఉంది. ఆమెను అదే గ్రామానికి చెందిన లచ్చయ్యకు ఇచ్చి 25 ఏళ్ల కిందట వివాహం చేశారు. ఈ దంపతులకు శివకుమార్, సాయిబాబా, భాను ప్రసాద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. కష్టపడి ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. నాలుగేళ్ల కిందటే లచ్చయ్య  రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అలానే ఎనిమిది నెలల కిందట రెండో కుమారుడు సాయిబాబా అనారోగ్యంతో మృతి చెందాడు.

చిన్న కుమారుడు భాను ప్రసాద్  జులాయిగా తిరుగుతుండే వాడు. ఈక్రమంలో డబ్బుల కోసం తల్లి వద్దకు వెళ్లి డిమాండ్ చేశాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగి.. క్షణికావేశంలో భాను ప్రసాద్.. కత్తితో తల్లి మెడ కోశాడు.  డబ్బుల కోసం అన్నదమ్ములిద్దరు ఎంతకైన తెగిస్తారని గ్రామస్థులు కొందరు చెబుతున్నారు. మృతురాలు నర్సమ్మ..గతంలో తన తల్లిని కూడా డబ్బుల కోసం బండరాయితో మోది చంపింది. నర్సమ్మ తల్లి బాలమణి పేరిట భూమి ఉంది. ఆమె చనిపోతే రైతు బీమా వస్తుందని  నర్సమ భావించింది. పెద్ద కుమారుడు శివకుమార్ తో కలిసి తన తల్లిని చంపేందుకు కుట్ర పనింది.

2021లో బాలమణికి ఇంటి దాబాపై మద్యం తాగించి.. పైనుంచి తోశారు. కిందపడినా ఆమె చనిపోకపోవడంతో  నర్సమ్మ, ఆమె కుమారుడు బండరాయితో కొట్టి బాలమణి చంపారు. ఈ హత్య కేసులో నర్సమ్మ జైలుకు వెళ్లి తిరిగొచ్చింది. తల్లిని చంపిన పాపమే నర్సమ్మ కు తగిలిందని స్థానికులు అంటున్నారు. అమ్మమ్మ చనిపోయిన రైతు బీమా డబ్బులు వచ్చి ఉంటాయని భావించి.. చిన్న కుమారుడు భాను.. తన తల్లితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆమె మొదట కొడవలితో దాడి చేయగా,తప్పించుకున్న భాను ప్రసాద్ కత్తితో తల్లిని హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నర్సమ్మ చిన్న కుమారుడు భానుప్రసాద్ ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇదీ చదవండి: నర్సు వేషంతో మహిళ కన్నింగ్ ప్లాన్! ఏం చేసిందో తెలిస్తే అస్సలు నమ్మలేరు!

Show comments