iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల రోజులు గడవకముందే..!

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల రోజులు గడవకముందే..!

ఒకే గ్రామానికి చెందిన రుషిత, మహేష్ ఇద్దరు స్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో మునిగితేలారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లే నెల రోజుల కిందట వివాహం కూడా చేసుకున్నారు. అనుకున్నది సాధించామని ఇద్దరు ఎంతో మురిసిపోయారు. ఇదిలా ఉంటే.. మహేష్ తన భార్యను బుధవారం తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. తిరిగి సొంతూరుకు వస్తున్న క్రమంలోనే ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఇరువురి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామం. ఇదే ఊరికి చెందిన మహేష్ (23), రుషిత(19) ఇద్దరు కలిసి చదువుకునే క్రమంలో ప్రేమించుకున్నారు. చాలా కాలం పాటు వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. అనుకున్నట్లే గత నెల రోజుల కిందటే పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే.. మహేష్ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఈ నూతన దంపతులు తిరిగి ఇంటికి బయలు దేరారు. అయితే వీరి ప్రయాణిస్తున్న బైక్ ను నకిరికేల్ వద్ద ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రుషిత తీవ్రంగా గాయపడింది.

వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ రుషితను ఆస్పత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో రుషిత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకుని ఇరువురి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లై నెల రోజులు గడవకముందే నూతన దంపతులు మృతి చెందడంతో వీరి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే మృత్యు ఒడికి చేరిన ఈ నూతన దంపతుల విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి