Goregaon Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి!

భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి!

దేశ వాణిజ్యరాజధాని ముంబైలో ఇటీవల అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల శాంతా క్రూజ్ లోని గెలాక్సీ హూటల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణ హానితో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది. తాజాగా ముంబయిలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు.. పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

ముంబాయిలోని గోర్‌గోన్ ప్రాంతంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పొందారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెచ్‌బీటీ, కాపర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తుంది.

గోరేగావ్.. ఆజాద్ నగర్ లో జై భవానీ అపార్ట్‌మెంట్ లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. తర్వాత భవనం మొత్తం వ్యాపించినట్లు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న దుఖానాలు, వాహనాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments