Bus Accident in South America: ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి!

దక్షిణ అమెరికా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి ఓ భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు మృతి చెందారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెరూలోని ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటాకు తాజాగా ఓ బస్సు బయలు దేరింది. అయితే ప్రమాదవశాత్తు ఈ బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో అక్కడికకక్కడే 24 మంది మృతి చెందగా, 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు మార్గం సరిగ్గా లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరో విషయం ఏంటంటే? గతనెలలో కూడా ఇక్కడ ఓ రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Show comments