ఆత్మాహుతి దాడిలో 52 మంది మృతి

ఇటీవల పలు దేశాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆత్మాహుతి దాడులకు తెగబడుతూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. రద్దీగా ఉండే మార్కెట్, ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు టార్గెట్ చేసుకొని బాంబు దాడులు, కాల్పులు, ఆత్మాహుతి దాడులతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దీంతో ఎంతోమంది చనిపోతున్నారు.. వేల సంఖ్యలో వికాలాంగులుగా మారిపోతున్నారు. పండుగ పూట విషాదం నెలకొంది. ఆత్మాహుతి దాడిలో పదుల సంఖ్యల్లో మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన బలూచిస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ర్యాలీకి తరలి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పపడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 52 మంది మరణించారు. 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పోలీస్ ఉన్నతాధికారి ఉన్నట్లు సమాచారం. ఈ ర్యాలిలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డీఎస్పీ నవాజ్ గష్కోరీ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సందర్భంగా సిటీ స్టేషన్ హౌజ్ అధికారి మహ్మద్ జావేద్ మాట్లాడుతూ.. మసీద్ వద్ద ర్యాలీగా వచ్చి ప్రార్థనలు జరుపుతున్న సమయంలో డీఎస్‌పీ గిష్కోరి కారు పక్కన ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పపడి పేల్చుకున్నట్లు తెలుస్తుంది అన్నారు. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలను మస్తుంగ్ కి పంపించామని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

Show comments