TG Govt Subsidy To Oil Palm Cultivation: అన్నదాతలకు అలర్ట్‌.. మీరీ పంట వేస్తే .. ప్రభుత్వమే ఎకరాకు రూ.50 వేలు ఇస్తుంది.. ఎలా అంటే..

అన్నదాతలకు అలర్ట్‌.. మీరీ పంట వేస్తే .. ప్రభుత్వమే ఎకరాకు రూ.50 వేలు ఇస్తుంది.. ఎలా అంటే..

Oil Palm Cultivation-Subsidy: రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మీరీ పంట వేస్తే.. ప్రభుత్వమే ఎకరాకు 50 వేలు ఇవ్వనుంది. ఆ వివరాలు..

Oil Palm Cultivation-Subsidy: రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మీరీ పంట వేస్తే.. ప్రభుత్వమే ఎకరాకు 50 వేలు ఇవ్వనుంది. ఆ వివరాలు..

అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. పెట్టుబడి సాయం అందించడం, ఎరువులు, విత్తనాలపై సబ్సీడీ ఇవ్వడం మాత్రమే కాక.. పంట చేతికి వచ్చాక మద్దతు ధర ప్రకటించి.. వారు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అలానే వ్యవసాయ పరికరాలు, పనిముట్లపై భారీ ఎత్తున సబ్సిడీని ప్రకటిస్తున్నాయి. దాంతో అన్నదాతలు వడ్డీవ్యాపారుల బారిన పడకుండా చూడటం కోసం.. వారికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి. ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాయి. అలానే కొన్ని పంటలు సాగు చేయడం కోసం ప్రభుత్వమే భారీ ఎత్తున సబ్సిడీ అందిస్తూ.. అన్నదాతలను ప్రోత్సాహిస్తుంది. అలాంటి ఓ పంట సాగు గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. మీరీ పంటను సాగు చేస్తే ప్రభుత్వం మీకు ఎకరాకు ఏకంగా 50 వేల రూపాయల నగదు సాయం అందించనుంది. ఆ వివరాలు..

రైతులను సాంప్రదాయ పంటల సాగు నుంచి వాణిజ్య పంటల సాగు వైపు మరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాక మార్కెట్‌లో మంచి డిమాండ్ వున్న పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాయి. దీనిలో భాగంగా పామాయిల్‌కు ఉన్న డిమాండ్‌ గుర్తించిన ప్రభుత్వం.. ఆయిల్‌ పామ్‌ సాగు దిశగా రైతులను ప్రోత్సాహిస్తోంది. ఇందుకోసం పామ్ ఆయిల్ సాగుచేసే రైతులకు కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం భారీగా సబ్సిడీలు అందిస్తోంది. ఆయిల్‌ పాము సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వమే మొక్కలను ఉచితంగా అందిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీలకు 90 శాతం సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలను కూడా అందజేస్తుంది.

ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగుకు 50-57 మొక్కలు అవసరం అవుతాయి. ఇందుకోసం రూ.11,600 ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మొక్కలు నాటిన నాలుగేళ్లకు పంట దిగుబడి వస్తుంది. అప్పటివరకు రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేలా చూడటం కోసం ప్రభుత్వం.. పంట నిర్వహణకై ఏడాదికి రూ.4,200 ఆర్ధికసాయం చేస్తుంది. ఇలా నాలుగేళ్లకు రూ.16,800 అందజేస్తుంది. డ్రిప్ కోసం ఎకరాకు 22,518 రూపాయలు సబ్సిడీ అందిస్తోంది. ఇలా మొత్తంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు నాలుగేళ్లకు గాను ఎకరాకు రూ.50,000 పైగా సబ్సిడీ పొందవచ్చు.

ఆయిల్‌ ఫామ్‌ సాగుతో 30ఏళ్ల వరకు నిరంతరం ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్ ఫామ్ ధరలను బట్టి ఎకరాకు రెండు లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఈ పంటకు పెద్దగా నీటి అవసరం లేదు.. కాబట్టి నీటిఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు.

సబ్సీడీ పొందడం కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతులు ముందుగా ఈ సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు తెలియజేయాల్సి వుంటుంది.
  • సబ్సిడి కోసం మొబైల్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గూగుల్ లో MIP Registration అని టైప్ చేయగానే తెలంగాణ ప్రభుత్వ పోర్టల్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • ఇందుకోసం ఆధార్, భూమి పాస్ బుక్, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి.
  • ఆ తర్వాత అధికారులు మీరు ఇచ్చిన వివరాలను ధ్రువీకరించి.. సబ్సీడీ అందజేస్తారు.
Show comments