iDreamPost

రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమ.. ఇలా చెక్‌ చేసుకోండి

  • Published Nov 18, 2023 | 3:29 PMUpdated Nov 18, 2023 | 3:29 PM

అన్నదాతలను ఆదుకునేందుకు కేం‍ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. ఆ వివరాలు..

అన్నదాతలను ఆదుకునేందుకు కేం‍ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. ఆ వివరాలు..

  • Published Nov 18, 2023 | 3:29 PMUpdated Nov 18, 2023 | 3:29 PM
రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమ.. ఇలా చెక్‌ చేసుకోండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అన్నదాతలను ఆదుకోవడం కోసం పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కింది రెండు దఫాల్లో ఎకరాకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ మొత్తాన్ని దశలవారిగా 16 వేల రూపాయల వరకు పెంచుతామని వెల్లడించారు. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్‌ యోజన కింద ఎకరాకు ఆరు వేల రూపాయల సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో పీఎం కిసాన్‌ నగదు జమ చేసింది. ఆ వివరాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఝార్ఖండ్‌, ఖుంతీలోని బిర్సా కాలేజీ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ నగదు జమ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో మొత్తం రూ.18,000 కోట్లు విడుదల చేశారు. దాంతో రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ చేశామని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6,000 రూపాయలని అందిస్తుంది. ఎరువులు కొనుగోలుకు, వ్యవసాయానికి సంబంధించి అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదిలో మూడు సార్లు అనగా.. ప్రతి 4 నెలలకు ఒకసారి 2 వేల రూపాయల చొప్పున రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక పీఎం కిసాన్ నగదు సాయం ఖాతాల్లో జమ అయిందో లేదో తెలుసుకునేందుకు.. ఈ విధంగా చెక్‌ చేసుకోవాలి.

ఇలా చెక్‌ చేసుకోవాలి..

  • ముందుగా పీఎం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
  • ఆతర్వాత దానిలో ఉన్న రైతుల విభాగం లో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి.
  • ఆతర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి
  • రీ డైరెక్ట్ అయిన పేజీలో మీ పీఎం కిసాన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి.

అలానే మీకు ఏమైనా సందేహాలు ఉంటే రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు 155261 / లేదా 011- 24300606కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు. పీఎం కిసాన్ నగదు పడకపోయినా, మీకు వివరాలు కనిపించకపోయినా.. వెంటనే లబ్దిదారుల జాబితాను చెక్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండనుంది అంటున్నారు అధికారులు. దానిలో పేరు ఉంటే నగదు మీ ఖాతాలో జమ అవుతుంది అని తెలిపారు.

లబ్ధిదారుల జాబితా ఇలా చెక్‌ చేయాలి..

  • ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‌ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
  • ఆ తర్వాత హోం పేజీలో ఫార్మర్ కార్నర్‌లో బెనిఫిషియ‌రీ లిస్ట్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేయాలి.
  • అలా ఓపెన్ అయిన పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను సెలక్ట్ చేసి ‘గెట్ రిపోర్ట్‌’పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు ఈ విడత పీఎం కిసాన్‌ ల‌బ్ధిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • eKYC చేయించని వారిని లబ్ధిదారులు జాబితా నుంచి కేంద్రం ప్రభుత్వం తొలగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి