iDreamPost

కమల్‌ హాసన్ కు షాక్ ఇచ్చిన త‌మిళ‌తంబీలు

కమల్‌ హాసన్ కు షాక్ ఇచ్చిన త‌మిళ‌తంబీలు

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పార్టీల గెలుపోట‌ములు అటుంచితే క‌మ‌ల్ హాస‌న్ పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్ కు ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. ఏపీలో జ‌న‌సేన పార్టీలా అక్క‌డ ఆ పార్టీ ప‌రిస్థితి మారింది. కమల్‌ హాసన్‌ పోటీ చేసిన కోయంబత్తూర్ లో కూడా ఆయ‌న గెల‌వ‌లేక‌పోయారు. అవ‌స‌ర‌మైతే రాజ‌కీయాల గురించి సినిమాల‌ను వ‌దులుకుంటాన‌ని, ప్ర‌జా సేవ‌లోనే కొన‌సాగుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించినా ప్ర‌జ‌లు విశ్వ‌సించ లేదు. 234 స్థానాలు గ‌ల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామి సృష్టించింది. డీఎంకే కూట‌మి 159 స్థానాల్లో విజ‌యం సాధించింది. అన్నాడీఎంకే కూట‌మి 75 స్థానాల్లో గెలుపొందింది. మిగ‌తా పార్టీలకు స్తానం దొర‌క‌లేదు. ఎంతో కొంత ప్ర‌భావం చూపుతుంద‌నుకున్న కమల్‌ హాసన్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని కలలు కన్న కమల్ హాసన్ కు నిరాశే మిగిలింది. కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ఓటమిపాలయ్యారు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్‌పై కమల్‌హాసన్ పరాజయం పొందాడు.

కాగా కమల్‌మాసన్‌ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి కానున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి