iDreamPost
android-app
ios-app

నడి రోడ్డుపై బర్త్‌డే వేడుకలు.. ఆటో హారన్‌ కొట్టాడని..

నడి రోడ్డుపై బర్త్‌డే వేడుకలు.. ఆటో హారన్‌ కొట్టాడని..

ఈ మధ్యకాలంలో రోడ్ల మీద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం ట్రెండ్ అయిపోయింది. అలా చేయటం వల్ల రోడ్డుపై వెళ్లే వారికి ఎంత ఇబ్బంది కలుగుతుందో సెలెబ్రేషన్స్‌ చేసుకునేవారు పట్టించుకోరు. పైగా అడ్డు చెప్పిన వారి మీదకే తిరగబడుతూ ఉంటారు. తాజాగా, రోడ్డుపై బర్త్‌డే వేడుకలు సెలెబ్రేట్‌ చేస్తున్న ఓ గ్యాంగ్‌ దారుణానికి తెగించింది. కేకు కట్‌ చేస్తుండగా హారన్‌ కొట్టాడని ఓ ఆటో డ్రైవర్‌ను చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

తమిళనాడులోని అంబత్తూర్‌కు చెందిన 25 ఏళ్ల కామేష్ స్నేహితుడికి ఓ ఆటో ఉంది. కామేష్‌ ఆ ఆటోను అప్పుడప్పుడు నడుపుతూ ఉంటాడు.  గురువారం రాత్రి కామేష్ తన సోదరుడు సతీష్‌ను ఆటోలో ఎక్కించుకుని, అంబత్తూరు నుంచి ఒరగడంలో దింపడానికి బయలు దేరాడు. 11:30 గంటల సమయంలో వీరి ఆటో అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్ మీదుగా వెళుతూ ఉంది. అక్కడి రోడ్డుపై ఓ చోట 10 మంది అబ్బాయిలు కేక్ కట్ చేస్తూ బర్త్‌డే సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వాళ్లు రోడ్డుకి అడ్డంగా ఉండటంతో కామేష్ ఆటో హార్న్ కొట్టాడు. దీంతో ఆ యువకులు కామేష్‌తో గొడవకి దిగారు.

బర్త్‌డే సెలెబ్రేషన్స్ అయిపోయే వరకు ఆగమని హెచ్చరించారు. కామేష్, సతీష్ దీనికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆ యువకులు కామేష్‌ని కత్తితో పొడిచారు. సతీష్.. కామేష్‌ను కాపాడటానికి వెళ్లగా అతనిపై కూడా దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే కామేష్ మరణించాడు. పోలీసులు తీవ్రంగా గాయపడ్డ సతీష్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్, నవీన్ కుమార్, అజయ్, రియాజ్,సూర్యలతో పాటు మరో ఇద్దరు మైనర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి