iDreamPost

మహిళా ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని కాళ్లు మొక్కించిన విద్యార్థి సంఘం నాయకులు

మహిళా ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని కాళ్లు మొక్కించిన విద్యార్థి సంఘం నాయకులు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళా ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని కాళ్లకు దణ్ణం పెట్టించారు విద్యార్థి సంఘం నాయకులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఈ పని చేయించిన ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని హాజరు తక్కువగా ఉంది. దీంతో గురువారం ( మే 12,2022) ఆర్ఎస్ఎస్ కు చెందిన ఏబీవీపీ నేత అక్షత్ జైస్వాల్, ఆ విద్యార్థినితోపాటు మరి కొందరిని తీసుకుని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్‌ మోనికా స్వామి చాంబర్‌కు వెళ్లాడు. విద్యార్థిని హాజరు తక్కువగా ఉండటంపై ప్రిన్సిపాల్‌, ఆ కాలేజీ సిబ్బంది వాగ్వాదం పెట్టుకున్నారు. దానికి సిబ్బంది, ప్రిన్సిపల్ ఎన్ని రకాలుగా చెప్పినా ఏమాత్రం వినలేదు.

ఆ విద్యార్థికి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుపట్టారు. ఆఖరికి చేసేదేమీ లేక ఆ మహిళా ప్రిన్సిపల్ గొడవను శాంతింపజేయటానికి ఆ విద్యార్థినికి రెండు చేతులతో మొక్కింది. అనంతరం తన కూర్చి నుంచి లేచి ఆమె కాళ్లు పట్టుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఏబీవీపీ తీరుపై కాంగ్రెస్‌ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘం చర్య సిగ్గు చేటని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కన్వీనర్ భావవిక్ సోలంకి విమర్శించారు.విద్యా సంస్థల్లో ఏబీవీపీ గూండాయిజానికి ఈ వీడియో నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేసింది.

మరోవైపు ఈ ఘటనపై అక్షత్ జైస్వాల్ శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఉపాధ్యాయ, విద్యార్థి మధ్య సంబంధాన్ని పవిత్రంగా తమ సంస్థ భావిస్తుందని..తెలిపారు.ఈ విషయంలో తప్పు చేసిన అక్షత్ జైస్వాల్‌ను ఏబీవీపీ నుంచి తొలగించామని ABVP ప్రధాన కార్యదర్శి ప్రార్థన అమీన్ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి