iDreamPost

Evaru Meelo Koteeswarulu : కోటి గెలిచిన తెలంగాణా ఖాకీ

Evaru Meelo Koteeswarulu  : కోటి గెలిచిన తెలంగాణా ఖాకీ

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలై ఇప్పుడు చివరి దశకు వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరుడులో తొలి విజేత నమోదయ్యారు. అక్షరాలా కోటి రూపాయలు గెలిచిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర గెలుపు బావుటా ఎగురవేసినట్టు సమాచారం. దీని తాలూకు ఎపిసోడ్లు ఈ వారంలోనే ప్రసారం కాబోతున్నాయి. ఈ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నారు. కోటి రూపాయల ప్రశ్నను గతంలో ముగ్గురు ఎదురుకున్నారు. అయితే దానికి సరైన సమాధానం చెప్పలేక వదులుకున్నారు కానీ సాహసించిన వాళ్ళు లేరు. ఆఖరికి ఖాకీ చొక్కా ధైర్యం దాన్ని విజయవంతంగా జయించింది.

ఎస్ఐ రాజారవీంద్రకు గన్ షూటింగ్ అంటే చాలా మక్కువ. పోలీస్ శాఖ తరఫున జరిగే టోర్నమెంట్స్ లో పతకాలు గెలుచుకున్నారు. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఒలంపిక్స్ లో పాల్గొనాలనేది ఈయన టార్గెట్. దాని కోసమే కష్టపడుతున్నారు. ఇప్పుడు గెలిచిన కోటిలో అధిక మొత్తం దానికే కేటాయించబోతున్నారట. రాజారవీంద్ర జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విశేషాలను అతను పాల్గొన్న ,మొదటి ఎపిసోడ్ లో పూర్తి వివరంగా చూపించబోతున్నారు. విషయం లీకైపోయింది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారీ ఎత్తున వ్యూయర్స్ ఈ వారం మొత్తం ఎవరు మీలో కోటీశ్వరులుని ఫాలో కాబోతున్నారు. ఎన్ని భాగాలు ఇతను ఉంటారనేది తెలియాల్సి ఉంది

మొత్తానికి జెమిని ఛానల్ కోరుకున్నట్టు ఇప్పుడీ కోటి రూపాయల విజేత వల్ల ప్రోగ్రాం పాపులారిటీ పెరుగుతుంది. హిందీలో ఈ ఫీట్ ఎప్పుడో సాధ్యమైనప్పటికీ నాగార్జున, చిరంజీవిలు షోని రన్ చేసినప్పుడు సాధ్యం కాలేదు. ఒక రియాలిటీ షో ద్వారా ఇంత మొత్తాన్ని ఇవ్వడం కూడా తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇది మొదటిసారి. సీజన్ 2కి ఇది బూస్ట్ ఇవ్వొచ్చని అంటున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేయడానికి అంత సుముఖంగా లేరనే టాక్ కూడా ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు అయ్యాక కొరటాల శివ సినిమాలో పాల్గొనబోతున్న తారక్ కు ఈ కార్యక్రమం చేసే వీలుంటుందా అంటే వేచి చూడాలి మరి

Also Read : Akhanda : మాస్ ప్రేక్షకుల ఆశలన్నీ ఈ సినిమా మీదే 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి