iDreamPost

పండగ సినిమాల బిజినెస్ టార్గెట్

పండగ సినిమాల బిజినెస్ టార్గెట్

కౌంట్ డౌన్ వేగంగా పరుగులు పెడుతోంది. ఇంకో ఎనిమిది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర జరగబోయే జాతర కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ కి ఎంతో కీలకమైన సంక్రాంతి పండగ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో వర్ణించడం కష్టం. వీటి బిజినెస్ లెక్కలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముందుగా వాల్తేరు వీరయ్య సంగతి చూస్తే ఏపి తెలంగాణ కలిపి థియేట్రికల్ హక్కులు 42 కోట్ల దాకా అమ్ముడుపోయినట్టు తెలిసింది. ఆచార్య, గాడ్ ఫాదర్ ఫలితాల ప్రభావం కొంత ఉండటంతో చిరంజీవి సలహా మీద మైత్రి మేకర్స్ మరీ అత్యాశకు వెళ్లకుండా డీల్స్ ని క్లోజ్ చేసినట్టు సమాచారం.

ఇక ఇదే బ్యానర్ లో వస్తున్న బాలకృష్ణ వీరసింహారెడ్డిని 33 కోట్లకు ఫైనల్ చేశారట. అఖండ బ్లాక్ బస్టర్ తాలూకు పాజిటివ్ ఇంపాక్ట్ బాగా పని చేసింది. థియేటర్ల విషయంలో పెద్ద ఇష్యూ గా టాక్ లో ఉన్న వారసుడుని 9 కోట్లకు అమ్మారు. దిల్ రాజు బ్రాండ్ తో పాటు విజయ్ గత చిత్రాల పెర్ఫార్మన్స్ ప్రాతిపదికన డీసెంట్ గానే ఇచ్చారు. స్క్రీన్ కౌంట్ పరంగా చూసుకుంటే హిట్ టాక్ వస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ వేగంగా జరిగిపోతుంది. అజిత్ తెగింపు 1 కోటి 75 లక్షలకే ఇచ్చేసినట్టు వినికిడి. ఎలాగూ పరిమితంగా చేసే విడుదల కాబట్టి ఇంత కన్నా ఆశించలేం. కళ్యాణం కమనీయం 1 కోటి 25 లక్షలకు సేల్ అయ్యింది. యువి బ్యానర్ బ్యాకప్ తో సాహసం చేస్తున్న మూవీ ఇదే

వేటికవే అంచనాల పరంగా ప్రత్యేకత సంతరించుకున్నవి కావడంతో ఎవరు విజేతగా నిలుస్తారనే దాని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ లెక్కల్లో మార్పులు ఉంటాయి కానీ ఆ వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు థియేటర్ల సర్దుబాట్లు అగ్రిమెంట్లు వగైరా పనుల్లో బిజీగా ఉన్నారు. కనీసం వీటిలో మూడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా జనాలతో హాళ్లు కళకళలాడతాయి. టికెట్ రేట్లకు సంబంధించి పెంపు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనీసం రెండు వారాల పాటు హైక్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రావడం లాంఛనమేనని ఫిలింనగర్ న్యూస్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి