iDreamPost

రైతు దైన్యం కాదు…రామోజీ దైన్యం..!

రైతు దైన్యం కాదు…రామోజీ దైన్యం..!

నిజాన్ని చెప్పలేని స్థితిని… నిజాయితీగా రాజకీయాలు చేయలేని పరిస్థితిని ఏమంటారు…! ఒకవిధంగా ఈ బలహీనతలు కలిగినవారిని చూసి.. ఎంత దైన్యం అని నిట్టూర్చాల్సిందే..!ఎందుకంటే నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోవటం వారి అసక్తత..! ఉన్నతమైన రాజకీయ, పత్రికా రంగాల్లో ఉండి…విలువలకు తిలోదకాలు ఇచ్చే దయనీయ స్థితికి చేరినందుకు కచ్చితంగా…ఎంత దైన్యం అనాల్సిందే..!

పక్కా ప్లాన్…!

నచ్చని పార్టీ….అంతెందుకు తనకు నచ్చని వ్యక్తి అధికారంలో ఉంటే అస్సలు సహించలేని స్థితి…తెలుగు రాష్ట్రాల్లోని ఓ మీడియా ప్రముఖుడిది. గతంలో సొంత సామాజిక వర్గానికే చెందిన వాడైనా తన మాట లెక్కచేయలేదనే…నెపంతో ఎన్టీఆర్ పైనే తప్పుడు వార్తలు రాసి…ఆయన్ను గద్దె దింపపడంలో కీలకంగా వ్యహరించిన చరిత్ర ఈయనకు ఉంది. ఇక తాజా విషయానికి వస్తే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి…అత్యధిక సర్క్యులేటెడ్ పత్రికలో దురుద్దేశా పూరిత కథనాలను వండి వారుస్తున్నారు. ఆ క్రమంలో వచ్చినవే…నిన్న ప్రచురితమైన రైతు దైన్యం కథనం…ఈ రోజు ప్రముఖంగా వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు వార్తలు..!

తప్పు చేశాను.. సారీ..!

‘ముఖ్యమంత్రిగా తప్పుచేశాను… దానికి బాధపడుతున్నాను…క్షమించండి’…ఈ వాఖ్యలు ఎవరు చేసుంటారు…? ఇది 2012లో రౌతు పోరుబాట కార్యక్రమంలో నెల్లూరులో రైతులతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంభాషణ..! దీన్ని బట్టి చంద్రబాబు రైతులకు ఏంచేశాడో వేరెవరో చెప్పక్కర్లేదు. ఐతే రాజగురువు, చంద్రబాబునాయుడులు కలిసి రైతుల ఆసరాగా స్వార్థ పూరిత రాజకీయాలకు తెరలేపిన తరుణంలో బాబుగారి ఘనత ల్లో మచ్చుకు కొన్నిటి గురించి చెప్పుకోక తప్పదు…

రైతుకు నరకం…!

చంద్రబాబునాయుడు పాలనలో 1995-2004 మధ్య రైతులు నరకం చవిచూశారు. అప్పటి బాబు పాలన తీవ్రమైన రైతు వ్యతిరేక విధానాలతో సాగి రైతుల నడ్డి విరిచింది. కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచటమే కాకుండా…శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులపై బషీర్ బాగ్ లో కాల్పు జరిపించిన చరిత్ర బాబు గారిది. బిల్లులు కట్టలేదని మీటర్లను పోలీస్ స్టేషన్లో పెట్టించినా.. దీన్ని అడ్డుకున్న రైతులను జైళ్లకు పంపినా అప్పట్లో చంద్రబాబుకే చెల్లింది. అయితే అవన్నీ మరచి రైతులకు మద్దతు ధర అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు, ఆయన గురువయిన పత్రికాధినేత.

సరే మద్దతు ధర విషయనికే వద్దాం…చంద్రబాబు తొలి విడత పాలన(1995-2004)లో వరి మద్దతు ధరను రూ.360 నుంచి రూ.530కి మాత్రమే పెంచగలిగారు. అంటే 9 ఏళ్ల కాలానికి పెరిగిన ధర కేవలం రూ.170 మాత్రమే. అయితే బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలోనే వరి మద్దతు ధరను రూ.530 నుంచి రూ.1030కి తీసుకెళ్లారు. పోనీ తిరిగి రెండో సారి అధికారం లోకి వచ్చిన సారయినా చంద్రబాబు రైతులకు ఆసరాగా ఉన్నారా అంటే అదీలేదాయే..! సంవత్సరానికి రూ.50, రూ.60 చొప్పున.. ద్రవ్యోల్భణం రేటు కంటే తక్కువ స్థాయిలో మద్దతు ధరను పెంచారు. కానీ అప్పుడు ఈ విషయాలేవీ పట్టని రాజగురువు గారు ఇప్పుడు జగన్ పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.

బాబొస్తాడు.. బంగారం తెస్తాడు…!

రైతులెవరు బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దు… నేనొస్తాను… అన్నింటినీ మాఫీ చేస్తాను. ఇదీ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన హామీ. అంతే కాదు రుణాల కోసం బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం కూడా విడిపిస్తామని హామీ ఇచ్చారు. అమాయకంగా ఆయన మాటలు నమ్మిన రైతులు ఓట్లేశారు. 2014 సీఎం అయ్యే సరికి రూ. 87 వేల కోట్లకు పైగా రైతు రుణాలు ఉంటే…చంద్రబాబు నాయుడు ఏడాదికి రూ.3000 కోట్లే విడుదల చేసి…రైతులను దగా చేశారు. తద్వారా రైతులపై రూ.50 కోట్ల రుణ భారాన్ని మోపారు. దీంతో రాష్రంలోని 40 లక్షలకు పైగా రైతు అకౌంట్లు ఓవర్ డ్యూ లేదా ఎన్ పీఏ ఆకౌంట్లుగా మారిపోయిన స్థితిని మనం చూశాం. కానీ అప్పుడు ఇవేవీ పట్టని లార్జెస్ట్ పత్రికకు ఇప్పుడొక్కసారిగా రైతులపై ప్రేమ పుట్టుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలిసిందే.

అవకాశవాదమే… నిజమైన దైన్యం..!

2014-2019 మధ్య పంట విస్తీర్ణం నుంచి దిగుబడి వరకు అన్నీ తగ్గాయి. బాబు గారు చేసిన మోసం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం ఆపేయడంతో రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే గత ఎన్నికల్లో రైతులు తమ ఓట్లతో సమాధానం చెప్పారు. కాబట్టి ఇకనైనా రైతులు కేంద్రంగా రాజకీయం చేయడం ఆపేస్తే చంద్రబాబు కు, లార్జెస్ట్ పత్రికాధినేతకు మంచిది. లేదంటే రైతులు అసహ్యించుకునే పరిస్థితులు తలెత్తుతాయని చెప్పక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి