iDreamPost

కరోనా సెకండ్‌ వేవ్‌.. లాక్‌డౌన్‌పై ప్రధాని మాట..

కరోనా సెకండ్‌ వేవ్‌.. లాక్‌డౌన్‌పై ప్రధాని మాట..

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. మొదటి వేవ్‌ కన్నా ఈ సారే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్ష కేసులకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ప్రకటన చేశారు. మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందన్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. మరోసారి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ రోజు మోదీ కీలక ప్రకటన చేస్తారని రెండు రోజులుగా సాగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది.

కరోనా కట్టడికి సీఎంల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ప్రధాని మోదీ.. ఆ తర్వాత మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూలు ఓ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ కన్నా.. పరీక్షలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌గా నిర్వహించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. కోవిడ్‌పై పోరాటానికి అందరూ యుద్ధప్రాతిపదికన సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మొదటి వేవ్‌ను జయించినట్లుగానే సెకండ్‌ వేవ్‌ను కూడా జయిద్దామని సీఎంలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకునేలా చైతన్యవంతులను చేయాలన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు ఎక్కువగా చేయాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛతీష్‌గఢ్‌ రాష్ట్రాలలో మొదటి వేవ్‌ కన్నా ఎక్కువగా కోవిడ్‌ వ్యాప్తి ఉందన్నారు. పలు రాష్ట్రాలలో అధికార యంత్రాంగం నిర్లప్తంగా ఉందని మోదీ అసహనం వ్యక్తం చేశారు. కోవిడ్‌ పోరాటంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉండొద్దని సూచించారు.

Also Read : ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం.. ప్రధాని కీలక ప్రకటన ఏమిటి..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి