iDreamPost

రాహుల్ నాయకత్వానికి పీకే మార్కులు.. పదవుల పంపకంపై ప్రజెంటేషన్..

రాహుల్ నాయకత్వానికి పీకే మార్కులు.. పదవుల పంపకంపై ప్రజెంటేషన్..

దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జతకట్టేందుకు సిద్ధం కావడంతో దేశవ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు దఫాలుగా సోనియా, రాహుల్, కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ భేటీ అయ్యారు. బుధవారం సోనియా, కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిషోర్ సుమారు 6గంటల పాటు భేటీ అయ్యారు. ఈ క్రమంలో 2024 ఎన్నికలే టార్గెట్‌గా దేశంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏఏ పార్టీలతో చేతులు కలపాలనే విషయాలపై పీకే ఇచ్చిన 85 పేజీల పవర్ పాయింట్ బహిర్గతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల వ్యూహకర్త ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఎలా ఉండాలనే దానిపై స్పష్టంగా సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వ సమస్య పరిష్కారానికి పీకే రెండు నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ, పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా, వర్కింగ్ లేదా వైస్ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర వ్యక్తి, యుపిఎ చైర్‌పర్సన్‌గా పూర్వపు కాంగ్రెస్ నాయకుడు కొనసాగిస్తే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్ సూచనగా తెలుస్తోంది.

మరో విధానంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతర వ్యక్తి, యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా, పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్, ప్రధాన కార్యదర్శి సమన్వయకర్తగా ప్రియాంక ప్రశాంత్ తన ప్రజెంటేషన్‌లో సూచించారు. పార్లమెంటరీ పార్టీ అధినేతగా రాహుల్‌ పార్లమెంట్‌లోనూ, బయటా ప్రజల గొంతును సమర్థంగా వినిపించగలరని, మోడీకి వ్యతిరేకంగా ఆయనను నిలదీయగలరని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇప్పటికే ఆ వాదన కాంగ్రెస్ పక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతున్నట్లు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటరీ బోర్డు పునరుద్ధరణ జి-23 నాయకుల కీలక డిమాండ్లలో ఇదికూడా ఒకటి. యుపిఎ చైర్‌పర్సన్‌గా కాంగ్రెసేతర నాయకుడిని పిలవాలని శివసేనతో సహా కొన్ని ప్రతిపక్షాలు పదేపదే పిలుపునివ్వడం, ప్రశాంత్ ప్రజెంటేషన్ ఇదే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి