iDreamPost

దేశంలో 31 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నిర్దారణ..

దేశంలో 31 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నిర్దారణ..

1000 కి పైగా కరోనా మరణాలు

కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా  ఉధృతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 31,332 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 7696 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1897 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 73 మంది మరణించారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 728 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 9318 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 400 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలుగురాష్ట్రాలలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతుంది. తెలంగాణలో 1009 పాజిటివ్ కేసులు నమోదవగా, 25 మంది మృతిచెందారు.వైరస్ బారినుండి తెలంగాణలో 374 మంది కొలుకున్నారు. తెలంగాణాలో గత మూడురోజులుగా మరణాల సంఖ్య నమోదు కాకపోవడంతో పాటు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 1332 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 31 మంది మృతిచెందారు.  గడచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్ పరీక్షించగా 73 మందికి కోవిడ్ 19 నిర్దారణ అయింది. 287 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆక్టీవ్ కేసుల సంఖ్య 1014 గా నమోదయింది.

ప్రపంచవ్యాప్తంగా 3,138,919 మందికి కోవిడ్ 19 సోకగా 218,010 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 956,064 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,035,765 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 59,266 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి