ఏపీలో మిగిలిన మున్సిపల్, నగర పంచాయతీలకు సంబంధించిన కౌటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలించిన అధికారులు.. మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కట్టారు. ఉద్రిక్త పరిస్థితులు తతెలెత్తుతాయి అని భావించిన చోట్ల ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతించారు పోలీసులు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి నగర పంచాయతీ ని అధికార వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఈ రోజు జరిగిన కౌంటింగ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగగా ఎట్టకేలకు అధికార వైసీపీ దాచేపల్లి నగర పంచాయతీని కైవసం చేసుకుంది. ముందు రౌండ్లలో ఫలితాలు చూస్తే టీడీపీ ఈ నగర పంచాయతీని గెలుచు కుంటుందా ? అన్నట్టు ఫలితాల సరళి కనిపించింది కానీ చివరి రౌండ్లలో వైసీపీ ఎక్కువ వార్డులు గెలుచుకోవడంతో ఎట్టకేలకు నూతనంగా ఏర్పాటు అయిన దాచేపల్లి నగర పంచాయతీ పై వైసీపీ జెండా ఎగర వేసినట్టు అయ్యింది.
మొత్తం 20 వార్డులకు గాను 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి, ఒక వార్డ్ వైసీపీకి ఏకగ్రీవం అయింది. అలా మొత్తం మీద 20 వార్డులకు గాను వైసీపీకి 11, టీడీపీ 8 వార్డుల్లో విజయం సాధించాయి. ఇక్కడ ఒక వార్డులో జనసేన గెలిచింది. అలాగే గురజాల నగర పంచాయతీ విషయానికి వేస్తే ఇక్కడ 20 వార్డులకు గాను మొత్తం ఆరు వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మొత్తం 20 వార్డులకు గాను 14 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు అనంతరం 20 వార్డులకు గాను వైసీపీ 16, టీడీపీ 3, జనసేన ఒక వార్డులో గెలుపొందాయి. తన నియోజకవర్గంలో ఉన్న రెండు నగర పంచాయతీల గెలుపుతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నియోకవర్గస్థాయిలో పట్టు నిలుపుకున్నట్టు అయ్యింది. అయితే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు సైతం గట్టి పోటీ ఇచ్చేలా కష్టపడ్డారు. కానీ యరపతినేని ముందే ఓటమి అర్థం కావడంతో రకరకాల ఆరోపణలను గుప్పించారు. నిజానికి ఈ నగర పంచాయతీ ఎన్నికలను ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి దాచేపల్లి, గురజాల మధ్యే తిరుగుతూ తమ తమ పార్టీలను గెలిపించుకునేలా కష్టపడ్డారు.
అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు దగ్గరుండి వేయించడం అంతా దగ్గరుండి చూసుకున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీలో పోటీ చేసే ఔత్సాహికులు పెద్ద ఎత్తున ఉన్నా, వారిని సమన్వయం చేసి, సర్ది చెప్పి నామినేషన్లు వేయించడంలో ఎమ్మెల్యే మహేష్రెడ్డి సఫలమయ్యారు. కానీ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అయితే కష్ట పడుతూనే ఉంది. అభ్యర్థుల ఎంపిక, వారిని నామినేషన్లు వేయించడం, వారిని ఉపసంహరించు కోకుండా అభయం ఇవ్వడం వంటి విషయాల్లో తాను ఉంటానని భరోసా ఇవ్వడం, వరకు ప్రచారంలో యరపతినేని శ్రీనివాసరావు శైలిలో ముందుకు వెళ్లారు. మొత్తం మీద ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు నేతలు ఇద్దరూ అన్ని విధాలా ప్రయత్నించినా అందులో కాసు మహేష్ రెడ్డి సఫలం అయ్యారు.
Also Read : Darsi Municipality – బోణికొట్టిన టీడీపీ.. దర్శి నగర పంచాయతీ కైవసం